హైదరాబాద్: ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు భాగ్యనగరంలోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా ఆలయాలకు చేరుకున్న ఆయనకు ఆయా ఆలయాల అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.

Also Read-
ఆలయాల వద్ద భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల సందడి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
