హైదరాబాద్ : Special Intensive Revision (SIR) ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొందరు అనవసర అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న బూత్ లెవల్ అధికారులు (BLOలు) మొదటి దశలో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలి. రెండో దశలో తిరిగి వెళ్లి వివరాలను ధృవీకరించి, ఆ ఫారాలను సేకరించాలి. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
ఈరోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ని కలవడానికి ప్రధాన కారణం హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే. వారిలో చాలామందికి తెలుగు తెలియదు. అందువల్ల ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలకు అర్థమయ్యే భాషలో అందుబాటులో ఉంచాలని, కేవలం హైదరాబాద్కే కాకుండా అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు ఫారాలు అందించాలని మేము కోరాం.

హైదరాబాద్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారందరికీ తమ ఓటు నమోదు చేసుకునే అవకాశం సులభంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్లాం. కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఎల్ఓలను బెదిరిస్తూ, కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, అక్కడి ప్రజల వివరాలు నమోదు చేయకుండా ఒత్తిడి తెస్తున్నారని మా దృష్టికి వచ్చింది.
ఇది కూడ చదవండి-
దీనివల్ల నిజమైన అర్హులైన ఓటర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ విషయాన్ని కూడా సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్లగా, దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటికే 92 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ అయ్యాయని అధికారులు తెలిపారు. జూలై 24 చివరి తేదీ కావడంతో ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పకుండా ఈ ప్రక్రియలో పాల్గొని తన ఓటు నమోదును పూర్తి చేసుకోవాలని నేను కోరుతున్నాను.
అలాగే, కొందరు ప్రాంతాల్లో బీఎల్ఓలను వెళ్లనీయకుండా ఒకేచోట కూర్చోబెట్టి సమాచారం సేకరించేలా చేసి, అక్రమంగా దొంగ ఓట్లు నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మేము సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్లాం. దొంగ ఓట్లు, ముఖ్యంగా అక్రమంగా రోహింగ్యా ఓట్లు నమోదు కాకుండా ఎన్నికల సంఘం అప్రమత్తంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. ఒకవేళ పొరపాటున అలాంటి నమోదులు జరిగినా, బీఎల్ఏ-2 (BLA-2) ద్వారా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం హైదరాబాద్లో నివసిస్తున్న ఇతర జిల్లాల, ఇతర రాష్ట్రాల ప్రజలను బెదిరిస్తోందని మా దృష్టికి వచ్చింది. “మీరు మీ స్వస్థలంలో లేకపోతే రేషన్ రాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందలేరు” అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ అంశంపై కూడా విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జూలై 24 వరకు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో, గడువు పొడిగింపు అంశంపై పార్టీ స్థాయిలో చర్చించి, అవసరమైతే భారత ఎన్నికల సంఘానికి (Election Commission of India) లేఖ రాసి వినతిపత్రం సమర్పిస్తాం.
