హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను “క్రిమినల్స్”, “వేస్ట్” అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాష్ట్ర విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
గతంలో కూడా రేవంత్ రెడ్డి ఫీజుల రీయింబర్స్మెంట్ విషయమై మాట్లాడుతూ, “మేమెందుకు ఫీజులు ఇవ్వాలి? బకాయిలు మీరే కట్టుకోండి” అంటూ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలను బహిరంగంగా బెదిరించే విధంగా మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు కళాశాల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు దిగుతోంది. ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని “క్రిమినల్స్”, “వేస్ట్” అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం.
Also Read-
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుంది.
