హైదరాబాద్ : నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి చేపట్టిన “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర” నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మున్సిపాలిటీలో విజయవంతంగా కొనసాగుతూ ప్రజల నుంచి విశేష ఆదరణను పొందింది. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు మరియు ఇతర బడుగు, బలహీన వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.

సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత మరియు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ జ్ఞాన చైతన్య బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలు తమ హక్కుల పట్ల చైతన్యవంతులై ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, సామాజిక సమానత్వం సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల హక్కుల సాధనలో ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Also Read-
ఈ జ్ఞాన చైతన్య బస్సు యాత్ర ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రాజ్యాంగ హక్కులు, విద్యా అవకాశాలు, ఉపాధి పథకాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యాత్రకు తమ మద్దతు తెలిపారు.

