హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ (ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం) తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించడానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది.
రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సంస్కృతిక విప్లవానికి ఊతకర్రగా నిలుస్తూ తెలంగాణ జాగృతిని స్థాపించిన కల్వకుంట్ల కవిత 20 ఏళ్ల తన ప్రజా జీవితంలో ఎన్నో మైలు రాళ్లను చేరుకున్నారు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తికి నేడు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు.
మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ తో పాటు దానిని ఆనుకునే ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు.
Also Read-
శనివారం ఉదయం 7.30 గంటలకు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి బయల్దేరుతారు. ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఉదయం 8.25 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నుంచి బయల్దేరుతారు. ఉదయం 9.30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను కల్వకుంట్ల కవిత ఆవిష్కరిస్తారు. ఉదయం 10.05 గంటల ప్రసంగం ప్రారంభిస్తారు.. గంట 15 నిమిషాల నుంచి గంటన్నర పాటు కవిత గారు ప్రసంగిస్తారు.
సభ ప్రాంగణం పేరు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం, ప్రధాన ద్వారం : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ద్వారము.
ఇతర ద్వారాల పేర్లు : రాణి రుద్రమ దేవి ద్వారము, మారోజు వీరన్న ద్వారము, చాకలి ఐలమ్మ ద్వారాము.
భోజన శాలల పేర్లు :
సురవరం ప్రతాపరెడ్డి భోజన శాల
సమ్మక్క సారలమ్ భోజన శాల
షోయబుల్లా ఖాన్ (మీడియా) భోజన శాల
క్యాడర్, అతిథులకు 34 వంటకాలతో తెలంగాణ రుచులతో భోజనాలు
నూతన పార్టీ ప్రకటన అనంతరం పార్టీ కార్యకర్తలు, అతిథులకు తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. మధ్యాహ్న భోజనం కోసం 34 రకాల వంటకాలను సిద్ధం చేశారు.
నాన్ వెజ్ లో తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలాన్, ఎగ్ ఇగురు వడ్డించనున్నారు.
వెజిటేరియల్ లో బగరా బైంగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు సిద్ధం చేయనున్నారు.
తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలను కూడా మెనులో చేర్చారు. వీటితో పాటు బగరా రైస్, వైట్ రైస్, సాంబర్, రోటి పచ్చడి, దోస, ఆవకాయ, మిర్చి బజ్జి, పచ్చి పులుసు, పపడ్, పెరుగు, రైతా కూడా ఉండనున్నాయి. మజ్జిగ, రాగి అంబలి కూడా పార్టీ అవిర్భావ సభలో అందుబాటులో ఉంటాయి. ఇక డిజర్ట్ లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహి తుక్ డా, జిలేబీ పెట్టనున్నారు.
