హైదరాబాద్: మియాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కారణంతో యువతిపై దాడి చేసి..ఆ తర్వాత తాను గొంతు కోసుకున్నాడు. దాడి చేసిన వ్యక్తిని సందీప్ గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన పై మాదాపుర్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. సందీప్, యువతి ప్రేమించుకున్నారని, ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారని చెప్పారు. యువతికి మరొకరితో వివాహం జరుగుతుందని తెలుసుకున్న సందీప్… హైదరాబాద్ కు వచ్చి ఈరోజు ఉదయం యువతి తల్లితో గొడవ పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో వారిపై సందీప్ కత్తితో దాడి చేసి, అతను కూడా గొంతు కోసుకున్నాడని శిల్పవల్లి చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ తల్లీ కూతుళ్లను కిమ్స్ కు తరలించారు. గొంతు కోసుకున్న సందీప్ ను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. యువతి తల్లి, నిందితుడు సందీప్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. యువతికి ప్రాణాపాయం తప్పిందన్నారు. గత మూడేళ్లుగా సందీప్, బాధిత యువతి ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సందీప్ ను సదరు యువతి పట్టించుకోకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.
సందీప్ను దూరంపెట్టిన వైభవి.. తన తల్లితో కలిసి హైదరాబాద్లోని మియాపూర్కు వచ్చి నివాసం ఉంటోంది. అయితే, సందీప్ మాత్రం వైభవికి ఫోన్ చేసి వేధిస్తున్నాడు. ఫోన్ తీయకపోతే నంబర్లు మార్చి చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులతో చెప్పింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. (Agencies)