“సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలి”

కలం విదిల్చడమే కాదు జూలు విదిల్చండి

మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న వాటిని తరిమికొట్టాలి

సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలి

దాశరధి మాట తెలంగాణ ఉద్యమానికి బాట

ఇందూరు జైలు ప్రాంగణంలో దాశరధి విగ్రహం

హరిద రచయిత సంఘం మహాసభలో కల్వకుంట్ల కవిత

నిజామాబాద్: సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం రోజున నిజామాబాద్ లో జరిగిన హరిద రచయితల సంఘం 5వ మహాసభలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు.

దాశరధి, వట్టికోట అళ్వారుస్వామిని నిజాం కాలంలో ఇందూరు జైలులో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరధి బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాట యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపించిందని స్పష్టం చేశారు. ఆ జైలు గోడను తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 40 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జూలై 22న దాశరధి జయంతి సందర్భంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పటు చేస్తున్నామని తెలిపారు. కొత్త తరానికి దాని ప్రాముఖ్యత తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఢిల్లీ నగర నడిబొడ్డున ఒక ఆడపిల్లను కత్తిపోట్లు పొడిచి బండరాయితో తలపై మోది చంపేస్తే కూడా చుట్టూ ఉన్నవాళ్లు వీడియోను చిత్రీకరించారుకానీ ఎవరూ ఆపిన పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఎటు నుంచి ఎటు పయనిస్తున్నామన్నది ఆలోచించుకోవాలన్నారు. దరిద్రపు సెల్ ఫోన్ అనేది చేతికి, మనిషికి ఎక్స్ టెన్షన్ లా తయారయ్యి సున్నితత్వంలేని విధంగా మనుషులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

“ఇవాళ రకరకాల అంశాల ఇంటిదాక వస్తున్నాయి. మన నోటును కొల్లగొట్టడానికి, మన ఓటును కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలు సరే. కానీ మన సున్నితత్వాన్ని, మన మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తప్పకుండా తరిమికొట్టాలి” అని కవిత పిలుపునిచ్చారు.

ఒక పుస్తకాన్ని చదువుతుంటే జీవితాన్ని మనది మనం అనుభవిస్తున్నట్టుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ సినిమాలు అలా ఉండవని, చాలా తక్కువ సినిమాలు ఆలోచింపజేసేలా ఉంటాయని చెప్పారు. లుక్ కల్చరా లేదా బుక్ కల్చరా అంటే… తనదైతే బుక్ కల్చరేనని స్పష్టం చేశారు. పుస్తక సంస్కృతిలోకి మనం పిల్లలను లాగకపోతే ఘోరాన్ని చూసి స్పందించే గుణాన్ని కోల్పోయామో అలా భవిష్యత్తులో ఇంకా దారుణాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

ప్రపంచీకరణ జరిగిన తర్వాత మన ఫోన్లకు రకరకాల జాఢ్యాలు వచ్చాయని, అవి పెరిగి పెచ్చరిల్లుతున్నాయని, వాటికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అది సాహిత్యంతోనే జరుగుతుందన్న విశ్వాసం తనకు ఉందని, మనిషి, సమాజపు ఆలోచనను మార్చే శక్తి ఒక చిన్న సిర చుక్కకు ఉందని వ్యాఖ్యానించారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిందీ భాషలో రాసే కవులను కూడా కూడగట్టి భారతదేశంలో వస్తున్న నిర్లిప్తత ఏంటి ? సంస్కృతి ఏంటి ? అన్న అంశాలపై రాయాలని ప్రోత్సహిస్తున్నామని వివరించారు.

కలం విధిల్చడమే కాదు జూలు విధిల్చాలని రచయితలకు పిలుపునిచ్చారు. 2009లో ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుంటే పార్టీలు లేవు… ఏమీ లేవు అని అన్న సీఎం కేసీఆర్ అప్పటి మంత్రి జానా రెడ్డికి వెళ్లి ప్రొఫెసర్ కోదండరాంను పిలిపించి జేఏసీ ఏర్పాటు చేయించారని, పార్టీలు కాదు మనకు తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. అది తెలంగాణ గురించి అయినా, మన దేశం గురించి అయినా రాజకీయం ఏమీ లేదని, ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచన అని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన సాహితీవేత్తలు ఉన్నారని తెలిపారు. తరతరలా నుంచి ఉన్న ఈ అద్భుతమైన సాహిత్య సంపదను కొనసాగించాలని ఆకాంక్షించారు.హరిద రచయితల సంఘం కార్యకలాపాలు సాగించడానికి ఒక నిర్ధిష్టమైన స్థలం అవసరమని, అందుకు వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా హరిద కార్యకలాపాలు విస్తరించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X