హైదరాబాద్ : ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని, యావత్ ప్రపంచం వారి వైపే ఆశగా చూస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, ఉపాధ్యాయులు మరియు ఆధ్యాత్మిక గురువుల భారీ భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘గ్లో పీస్’ అంతర్జాతీయ శాంతి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు నిరంతరాయంగా యుద్ధాల్లో మునిగిపోవడం వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, తీవ్రమైన మానవ, ఆర్థిక, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన హిరోషిమా, నాగసాకి అణు విపత్తులను గుర్తుచేస్తూ.. ప్రస్తుత కాలంలో అణ్వాయుధ ముప్పు అనేది యావత్ భూగోళానికి, మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు. యుద్ధాలు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాలేవని, కేవలం శాంతి ద్వారానే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. కొన్ని దేశాలను పాలిస్తున్న నేతల్లో ఈ శాంతి ఆలోచన లోపించడం దురదృష్టకరమన్నారు.
Also Read-

ఈ ‘గ్లో పీస్’ సదస్సు యువ మనసుల్లో శాంతి భావనలను నాటడానికి ఒక అద్భుతమైన వేదిక అని రాంచందర్ రావు గారు కొనియాడారు. శాంతి అనేది కేవలం దేశాల మధ్యే కాదు.. ఇల్లు, బడి, స్నేహితులు మరియు సమాజం నుండి ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నతనం నుంచే శాంతియుతంగా ఉంటూ, ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలని కోరారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని ఆకాంక్షించే దేశమని, మనమంతా శాంతి కాముకులమని రాంచందర్ రావు గారు ఉద్ఘాటించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ ‘జనజాగృతి’ లో భాగంగా తెలంగాణ గడ్డపై, హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్య ప్రతినిధులకు, అలాగే ఇంతటి గొప్ప కార్యక్రమానికి బాధ్యత వహించిన ఉపాధ్యాయ బృందానికి తన తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ప్రపంచ శాంతి కోసం ఈ సదస్సు ద్వారా ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు. ఒక్క డిపిఎస్ నాచారం నుంచే దాదాపు 20 వేల మంది విద్యార్థులు పాల్గొనగా.. ఇతర పాఠశాలలను కూడా కలుపుకుని మొత్తం ఒక లక్ష పోస్ట్కార్డులను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలో శాంతి కోసం ప్రయత్నాలు చేసి, ఒక ‘శాంతి దూత’గా నిలవాలని కోరుతూ విద్యార్థులు ఈ కార్డులను రాశారన్నారు. పాఠశాల స్థాయిలో ప్రారంభమైన ఈ చిన్న కార్యక్రమం ప్రపంచానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో ఇది దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా ఒక గొప్ప శాంతి ఉద్యమంగా మారుతుందని రాంచందర్ రావు గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

