హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో చదివే విద్యార్ధులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి నిర్దేశించిన విధంగా ముందుకు వెళ్ళుతున్నట్లు వీసీ ఓఎస్డీ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. “విద్యా వారోత్సవాల్లో” భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో 9 ప్రఖ్యాత సంస్థలతో కలిసి శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు.

అంబేద్కర్ యూనివర్సిటీ లో చదివి ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ “జాబ్ మేళ” నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సంస్థల్లో ఉద్యోగ కల్పన కోసం క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహించామని, ఇందులో 102 మంది విద్యార్ధులు ఉద్యోగాలు పొందారని, మరో వంద మందికి పైగా విద్యార్ధులు ఫైనల్ రౌండ్ కి ఎంపిక అయ్యారని వివరించారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ కోసం 3,000 మందికి పైగా నమోదు చేసుకోగా మొదటి విడుతలో 416 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయా సంస్థల ప్రతినిధులు ఉద్యోగ పత్రాలను అందజేశారు.
Also Read-

ఇందులో ఇన్ఫినిక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, వింగ్స్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, సెన్సేషనల్ అగ్రి ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిస్కో ప్రైవేట్ లిమిటెడ్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, టీమ్ లీజ్, డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వంటి తొమ్మిది సంస్థలలో ఐటీ, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, మార్కెటింగ్ వంటి పలు రంగాలలో ఉద్యోగ నియామకాలు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్లేస్మెంట్ డ్రైవ్లను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రొ. పి. వెంకటరమణ; ప్రొ. చంద్రకళ, ప్రొ. రజనీ డా. రాధాకృష్ణ, డా. రాఘవేంద్ర, డా. రజిత, డా. పడాల లక్ష్మణ్, డా. సునీల్ పోతన తదితరులు పాల్గొన్నారు.
