హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు “విద్యా వారోత్సవాల్లో” భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో “ఆవిష్కరణ, సమగ్రత, సంస్థాగత నాణ్యత మరియు విస్తరణ” అనే అంశంపై “విద్యా వారోత్సవాలను” సోమవారం విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి ప్రారంభించారు. వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వీసీ వెల్లడించారు.
ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), అదేవిధంగా ఆదివాసీ విద్యార్ధులకు చేయూత గా నిలుస్తోన్న జ్యోతి రెడ్డి ఫౌండేషన్లతో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి సమక్షంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి, సీఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డా. బి. వీర్రాజు, జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఛైర్పర్సన్ శ్రీమతి డి. జ్యోతి రెడ్డి సంతకాలు చేసి అవగాహన ఒప్పందాలను చేసుకున్నారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సైనిక సిబ్బందికి ప్రత్యేక అధ్యయన కేంద్రం ఇవ్వడం సంతోషంగా ఉందని, దేశ సేవలో ఉండే వారికి సేవ చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధ క్షేత్రంలో మరణించిన వీరుల భార్యలకు (సైనిక సిబ్బంది వితంతువులకు), దివ్యాంగులకు ఉచిత విద్యను అందించే లక్ష్యంతో సీఆర్పీఎఫ్ ప్రాంగణంలో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని ప్రొ. చక్రపాణి గుర్తుచేశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, దేశ సేవలో నిరంతరం నిమగ్నమై ఉండే సైనిక సిబ్బందికి ఉచిత విద్యను అందించడం ద్వారా, ఈ విశ్వవిద్యాలయం ఇప్పటికే తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తోందని ఆయన పేర్కొన్నారు.
Also Read-
విశ్వవిద్యాలయం రూపొందించిన ‘సమాన అవకాశాల ప్రణాళిక’ (Equal Opportunity Plan) కింద, రాష్ట్రంలోని గోండు, కోయ, చెంచు మరియు ఇతర వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన పిల్లలకు ఉచిత ఉన్నత విద్యను అందించే కార్యక్రమాన్ని ఇప్పటికే విశ్వవిద్యాలయం సేవలను అందిస్తుందని వివరించారు. అణగారిన వర్గాలకు, సైనిక సిబ్బంది వితంతువులకు ఆర్థిక సాధికారత కల్పించడంలోనూ, వారి తదుపరి చదువులను ప్రోత్సహించడంలోనూ జ్యోతి రెడ్డి ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రొ. చక్రపాణి అభినందించారు.
ఆదివాసీ విద్యార్ధులకు అందించే జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెల్లోషిప్స్ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, ప్రొ. పల్లవి కాబ్డే, వీసీ ఒఎస్ది ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, డా. వై. వెంకటేశ్వర్లు; ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. ఇ. సుధా రాణి, ప్రొ. చంద్రకళ, ప్రొ. రజనీ, ప్రొ. పి. వెంకట రమణ ఇతర డైరెక్టర్లు, డీన్లు, జ్యోతి రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ డి. సమ్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
