హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త సామాజిక భద్రతా పెన్షన్లపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

పేదలు, నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన వర్గాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏకకాలంలో పంపిణీ చేపట్టడం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ఇది కూడ చదవండి-
QR కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా రూపొందించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు.
అదేవిధంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లు అందించడం పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. “పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ నినాదం కాదు.. అది ప్రజా ప్రభుత్వ బాధ్యత” అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న అనేక సంక్షేమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డులు, పెన్షన్లు మాత్రమే కాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ తెలంగాణలో “ఇందిరమ్మ రాజ్యం – ప్రజా సంక్షేమ పాలన” ను బలోపేతం చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
పేదల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉన్న ఒక్క కుటుంబం కూడా సంక్షేమ పథకాల నుంచి దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. “స్వాతంత్ర్య దినోత్సవం రోజున లక్షలాది పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనం. ఇది తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.” అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
