హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి వలస పాలనను పారదోలి, 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకుందని పేర్కొన్నారు.

నిస్వార్థ పోరాట స్ఫూర్తి, దార్శనిక నాయకత్వం, త్యాగంతో కూడిన ప్రజల భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించాయని తెలిపారు. 79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభసందర్భంలో, దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిని ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాలని కేసీఆర్ అన్నారు.
Also Read-
ఫెడరల్ పాలనా విధానం, సెక్యులర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ పాలనలో భాగస్వామ్యం కానున్న నేటితరం మరింత జ్ఞానం, సహనం, దార్శనికతతో ముందడుగు వేసినప్పుడే స్వాతంత్ర్యోద్యమ త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
