- ఈకార్ రేసింగ్ స్కాంలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలున్నాయి
- కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదం
- గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ అక్రమంగా కేసులు బనాయించట్లేదు
- బిఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది
హైదరాబాద్ : కేటిఆర్ లో అహంకారం పరాకాష్టకు చేరిందని..ఆయనపై నమోదైన కేసు సక్రమేనని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నా.. కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహేష్ గౌడ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.కేటీఆర్ పై చట్టపరంగా కేసు నమోదు అయినందున ఈవిషయంపై అసెంబ్లీలో కాక.. కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ఫార్ములా ఈ` కారు రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని..ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక ఇది అక్రమ కేసు ఎలా అవుతుందని? ప్రశ్నించారు. ఆధారాలు కనిపిస్తున్నా..అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ బుకాయించడం విడ్డూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ అక్రమంగా కేసులు బనాయించట్లేదని మహేష్ గౌడ్ తెలిపారు. రేసింగ్ స్కాంలో నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకునే అధికారులు ముందుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. హెచ్ఎమ్డీఏ భాగస్వామ్యం కాకున్నా.. దాని ఖాతా నుండి ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే రూ.54.88 కోట్లు చెల్లించేలా కేటీఆర్ ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఫండ్స్ మంజూరు ఎలా చేస్తారని? హద్దుల్లేని కేటీఆర్ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారని ఆవేదన వెలిబుచ్చారు. నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో విదేశాల నిధులు బదిలీ చేయడంతో హెచ్ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. ఈ కార్ రేసింగ్ కి సంబంధించి నిబంధనలను కాదని మూడేళ్లలో రూ.600 కోట్లు చెల్లించేలా ఒప్పందం కేటీఆర్ అనుమతితోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.
Also Read-
బిఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెంచడామని? నిలదీశారు. బిఆర్ఎస్ నేతలు ఏం చేసినా వారి స్వలాభం కోసమేనని? తెలంగాణ, హైదరాబాద్ కోసం కాదని ఈ అక్రమాలే నిరూపిస్తున్నాయని అన్నారు. ఫార్ములా ఈ` కారు రేసు పేరుతో నిధులు గోల్మాల్ చేసి.. ఇప్పుడు సుద్ధపూసలాగ కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఛీకొట్టి గద్దె దింపినా ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలతో కేటీఆర్ బెదిరింపుల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణలో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్.. అహంకారంతో విర్రవీగుతూ, ఉద్యమకారులం భయపడం అంటూ కేసుకు సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారని మహేష్ గౌడ్ వివరించారు.