హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే గ్రాండ్ ట్రంక్ మార్గంలో సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దిశగా, దక్షిణ మధ్య రైల్వే సుమారు రూ.3,000 కోట్ల వ్యయంతో కాజీపేట – బల్హార్షా మధ్య 203 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ మరియు విద్యుదీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఆసిఫాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర చేపట్టిన మూడవ లైన్ నిర్మాణం మరియు విద్యుదీకరణ పనులు, అలాగే బిబ్రా నదిపై నిర్మించిన కీలకమైన వంతెనతో సహా, మొత్తం ప్రాజెక్ట్ 2026 జూలై 22న పూర్తయింది. దీనివల్ల గ్రాండ్ ట్రంక్ మార్గంలో నడిచే రైలు సర్వీసులు సజావుగా సాగేందుకు వీలవుతుంది.

కాజీపేట – బల్హర్షా మార్గం దేశంలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలను కలిపే ఒక కీలకమైన రైలు మార్గం. అంతేకాకుండా, ఈ మార్గంలో ఉన్న అనేక ఇతర బొగ్గు, సిమెంట్ సైడింగ్లను కూడా ఇది అనుసంధానిస్తుంది. దీని ఫలితంగా, కాజీపేట మరియు బల్హర్షా మధ్య రైలు మార్గంలో ప్రయాణీకుల, సరుకు రవాణా రెండూ నిరంతరం పెరుగుతూ, ఈ మార్గంలో రద్దీకి దారితీస్తున్నాయి. ఈ కీలకమైన మార్గంలో రద్దీని తగ్గించడానికి, మొదటగా రాఘవపురం–మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ పనులు 2016 సంవత్సరంలో పూర్తయ్యాయి. ట్రాఫిక్ను మరింత సులభతరం చేయడానికి, కాజీపేట – బల్హర్షా మార్గంలోని మిగిలిన 203 కిలోమీటర్ల (తెలంగాణలోని-159 కి.మీ. మహారాష్ట్రలోని 44 కి.మీ.) మేర ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనులకు 2015-16 సంవత్సరంలో అనుమతి లభించింది.

ప్రస్తుతం, సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే బల్హర్షా స్టేషన్ సమీపంలోనున్న చిన్న భాగం మినహా, మొత్తం మార్గంలో ట్రిపుల్ లైన్ నిర్మాణం మరియు విద్యుదీకరణ పూర్తయి, ప్రారంభించబడింది. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన మూడవ లైన్తో బల్హర్షా యార్డ్కు అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. కాజీపేట – బల్హార్షా మధ్యనున్న సెక్షన్ ల పనులు 2020 నుండి ఇప్పటి వరకు వివిధ దశల్లో పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా పూర్తవడంతో, తెలంగాణ మరియు మహారాష్ట్రలలో రైల్వే మౌలిక సదుపాయాలకు ఊతం లభించింది.
Also Read-

ప్రయోజనాలు:
తెలంగాణ మరియు మహారాష్ట్రలలో రైల్వే రవాణా మౌలిక సదుపాయాలను ఈ ప్రాజెక్టు గణనీయంగా బలోపేతం చేస్తుంది.
దేశంలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే గ్రాండ్ ట్రంక్ మార్గంలో సరుకు, ప్రయాణీకుల రవాణా సజావుగా సాగేందుకు వీలు కల్పిస్తుంది.
నూతన మూడో రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరిగి, ప్రజల రైల్వే రవాణా అవసరాలు, ఆకాంక్షలను మరింత సమర్థవంతంగా నెరవేరుస్తుంది.
సమీప రైల్వే సైడింగ్ల నుంచి బొగ్గు, సిమెంట్ వంటి సరుకులు, అలాగే తాప(థర్మల్) విద్యుత్ కేంద్రాలు మరియు పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల రవాణాను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు రద్దీని గణనీయంగా తగ్గించేందుకు దోహదపడుతుంది.
ప్రయాణీకుల రైలు సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఈ విద్యుదీకరణ పనులు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాక, విద్యుత్ ఆదా చేయడానికి మరియు ఇంధన వ్యయాన్నికూడా తగ్గించడానికి సహాయపడతాయి.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కాజీపేట – బల్హర్షా ట్రిప్లింగ్ ప్రాజెక్టును విద్యుదీకరణతో పాటు విజయవంతంగా పూర్తి చేయడంలో అంకితభావంతో కృషి చేసిన నిర్మాణ, ఇంజనీరింగ్, సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్, ఎలెక్ట్రికల్, ఆపరేటింగ్ మరియు ఇతర విభాగాల అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు. ఈ కీలకమైన ప్రాజెక్టు పూర్తికావడం వల్ల ఈ ప్రాంతంలో పెరుగుతున్న రవాణా అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు దోహదపడటమే కాకుండా, దేశంలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని జనరల్ మేనేజర్ పేర్కొన్నారు.
