ఈరోజు రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పిసిఎస్టీఈ బృందాన్ని అభినందించారు
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రైల్వే సిగ్నల్ ఇంజనీర్స్ (ఐ.ఆర్.ఎస్.ఈ), ఇండియన్ సెక్షన్ మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రైల్వే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐ.ఆర్.ఎస్.టీ.ఈ) సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు మరియు ప్రదర్శన-2026లో ప్రతిష్టాత్మక జాతీయ సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ (ఎస్ మరియు టి) అవార్డు లభించింది. ఈ అవార్డును 2026 జూన్ 12న న్యూఢిల్లీలో ప్రదానం చేయబడింది.
ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ – 2026, జూన్ 10 నుండి 13 వరకు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా, కృత్రిమ మేధస్సు ఆధారిత తదుపరి తరం రైల్వే కంట్రోల్, కమాండ్ మరియు సిగ్నలింగ్ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీపై ప్రధానంగా దృష్టి సారించబడింది. ఈ ప్రదర్శనలో 30 రైల్వే సంస్థలు, 25 ప్రముఖ విద్యాసంస్థలు మరియు దాదాపు 200 మంది ప్రదర్శనకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 10,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో భారతీయ రైల్వే వ్యవస్థ కోసం అధునాతన సాంకేతికతలు, వినూత్న వేదికలు మరియు పరిష్కారాలను ప్రదర్శించే సాంకేతిక సెమినార్లు మరియు ప్రదర్శనలు ఉన్నాయి. వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరును గుర్తించి రైల్వేలకు మరియు ఇతర ఏజెన్సీలకు అవార్డులు కూడా ప్రదానం చేయబడ్డాయి.

ఈ సందర్భంలో, దక్షిణ మధ్య రైల్వేను దేశంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జోన్ రైల్వేగా ఎంపిక చేసి, ప్రతిష్టాత్మకమైన జాతీయ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు దక్షిణ మధ్య రైల్వే నిరంతరం చూపిస్తున్న అద్భుతమైన పనితీరు, కవచ్ వ్యవస్థ మరియు డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అమలులో నూతన ప్రమాణాలను నెలకొల్పినందుకు లభించింది.
Also Read-
జోన్ వ్యాప్తంగా కవచ్ వెర్షన్ 4.0 అమలును వేగవంతం చేస్తూ, ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే గణనీయమైన పురోగతిని సాధించింది. అదే సమయంలో, జోన్లోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ప్రారంభించడం ద్వారా సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణను చేపట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, దక్షిణ మధ్య రైల్వే 21 డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్లను ప్రారంభించింది, 486 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ 4.0ను అమలు చేసింది మరియు 479 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ను ప్రారంభించింది. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల రైలు ప్రయాణాల్లో భద్రత పెరగడమే కాకుండా, రైల్వే కార్యాచరణ సామర్థ్యం మరింత మెరుగుపడనున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ మురళీకృష్ణ తన బృందంతో కలిసి ఈ రోజు , అనగా 16 జూన్, 2026న సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను మర్యాదపూర్వకంగా కలిసి, సాధించిన ఈ విశిష్ట విజయంపై వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ విభాగం అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం, కృషిని అభినందిస్తూ, వారి సమిష్టి ప్రయత్నాల ఫలితంగానే దక్షిణ మధ్య రైల్వేకు ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైల్వే వ్యవస్థను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి, రైళ్లను సురక్షితంగా నడపడానికి సిగ్నలింగ్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థల ఆధునికీకరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది ఇదే విధమైన ఉత్సాహాన్ని, వేగాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.
