దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారి ఆధ్వర్యంలో జోన్ వ్యాప్త సమగ్ర భద్రతా సమీక్ష
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు రుతుపవన కాలం, ఆకస్మిక గాలులు మరియు భారీ వర్షాల దృష్ట్యా, ఈరోజు సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ఒక ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి జోన్ సంసిద్ధతను అంచనా వేయడం, మరియు నిరంతరాయ, సురక్షిత రైలు కార్యకలాపాలను నిర్ధారించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్తో వివిధ శాఖల ప్రధాన శాఖాధిపతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మూడు డివిజన్ల అనగా సికింద్రాబాద్ , హైదరాబాద్ మరియు నాందేడ్ ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) మరియు వారి బృందాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు వర్షాకాలం నేపథ్యంలో మౌలిక సదుపాయాలకు, రైలు నిర్వహణ కార్యకలాపాలకు ప్రమాదాలకు అవకాశం ఊన్నందున, భద్రతా నియమాలను రాజీ లేకుండా తప్పనిసరిగా పాటించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, మట్టికోతకు గురయ్యే అవకాశం ఉన్న కట్టలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వంతెనలు, సొరంగాలు, రోడ్ అండర్ బ్రిడ్జెస్ ( ఆర్యుబి లు ) వంటి ప్రమాదానికి గురయ్యే ఆస్తులను ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. వేగవంతమైన స్పందన సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, ఇసుక, కంకర, సిమెంట్, బండరాళ్లు వంటి అవసరమైన సామగ్రిని వ్యూహాత్మకంగా నిల్వ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చురుకైన ముందస్తు తనిఖీల ప్రాముఖ్యతను కూడా జనరల్ మేనేజర్ నొక్కిచెప్పారు. భారీ వర్షాల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తక్షణమే అంచనా వేయడానికి మరియు వేగవంతమైన నివారణ చర్యలు చేపట్టడానికి అధికారులు స్వయంగా ‘ఫుట్ప్లేట్ డ్యూటీలు’ (ఇంజిన్ క్యాబిన్ నుండి తనిఖీలు) నిర్వహించాలని ఆయన కోరారు

జనరల్ మేనేజర్ రైళ్ల నిరాటంకమైన రాకపోకలు మరియు ప్రయాణీకుల భద్రతను కాపాడటానికి, తనిఖీల సమయంలో గమనించిన ఏవైనా లోపాలను తక్షణమే పరిష్కరించాలని పునరుద్ఘాటించారు. సరుకు రవాణా కార్యకలాపాలలో భద్రతా నియమాలను మెరుగుపరచడంపై మరియు పశువులు వాహనాల కిందపడి చనిపోయే ప్రమాదాలను నివారించడంపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు, పర్యవేక్షకులకు సూచించారు. దట్టంగా పెరిగిన వృక్షసంపద వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి, రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగే ప్రమాదాలను నివారించడానికి ట్రాక్లు మరియు ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ (ఓ ఎచ్. ఈ. ) సమీపంలోని చెట్లను నరకడం, కత్తిరించడం వంటివి చేయాలని జీఎం బృందాలను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యవేక్షకులు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా దానిని వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆయన నొక్కి చెప్పారు.
Also Read-
జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు రైల్వే భద్రత మరియు సమర్థవంతమైన నిర్వహణ పట్ల దక్షిణ మధ్య రైల్వే కి ఉన్న సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘వర్షాకాల ముందస్తు సన్నద్ధత అనేది కేవలం ఒక సీజనల్ ప్రోటోకాల్ మాత్రమే కాదు; ప్రయాణికుల భద్రత, రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం పట్ల మనకున్న దృక్పథానికి ఇది నిదర్శనం. ప్రతీ సూపర్వైజర్, ప్రతి బృంద సభ్యుడు అత్యవసరతతో, ఖచ్చితత్వంతో బాధ్యతలను నిర్వర్తించాలి’ అని స్పష్టం చేశారు.”
