YFC: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో కోరుట్ల చక్కెర పరిశ్రమను తెరుస్తాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో కోరుట్ల ప్రాంతంలోని చక్కెర పరిశ్రమను తెరుస్తాం” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటిచ్చారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా 25వ రోజు కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని ఐలాపూర్ గ్రామం నుంచి కోరుట్ల వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కోరుట్ల అంబేద్కర్ సర్కిల్ లో నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.

కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా? కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే వారికి ఆత్మహత్యలే దిక్కవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆరెస్ చేసిందేం లేదు.

బీఆరెస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారు?

బీఆరెస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారు? 2011లో శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ బీఆరెస్ కు మద్దతు తెలిపింది. కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా? ఆనాడు టీఆరెస్ నుంచి నిన్ను సస్పెండ్ చేసింది నిజం కాదా? తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యా సాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయినదాంట్లో కేసీఆర్ వాటా ఎంత?

ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది

100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారు. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నడు మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు. మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టిండ్రు? మీరు తలచుకుంటే కవితనే పాతాళానికి తొక్కిండ్రు… విద్యాసాగర్ రావు ఒక లెక్కనా? ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న గుండు… బోర్డు తిప్పేశారు.
ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.

తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదు

తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరు? మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. 2024, జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ. 5లక్షలు సాయం అందిస్తుంది. రైతులు బ్యాంకు లకు రుణాలు చెల్లించకండి.. కాంగ్రెస్ వస్తుంది.. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. పేదవారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాం.

ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని సందర్శించిన రేవంత్ రెడ్డి

ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. హర్యానా మాదిరిగా ఇక్కడి రైతులు లాభసాటి పంటలు పండిస్తారు. పది మందికి పని కల్పించి, పట్టెడన్నం పెట్టి ఆదుకుంటున్నారు ఇక్కడి రైతులు. గోదావరి జిల్లాల కంటే ఈ ప్రాంత రైతులు శ్రీమంతులు. తెలంగాణ ఉద్యమంలో రైతులు కీలక పాత్ర పోషించారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారు. ఆత్మ గౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారు.

ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. మా ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయమైతే… తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుంది. 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? చక్కెర కర్మాగారాన్ని కూడా నడిపించలేని కేసీఆర్ రాష్ట్రాన్ని నడపలేరు. కేసీఆర్ కు ఇక ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పసుపు బోర్డు తెస్తానన్న వ్యక్తి శంకరగిరి మాన్యాలు తిరుగుతుండు.

ఈ ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వరి వేస్తే ఉరే అని ప్రకటించిండు. కేసీఆర్ చెబుతున్న అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇదేనా? తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. కేసీఆర్ పై కోపంతో బీజీపీ వైపు వెళ్లొద్దు. బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. 10 లక్షల ఎకరాల చెరుకు రైతులను ఆదుకునే ఫ్యాక్టరీని ఎందుకు తెరవరు.

రైతుల కోసం 0.1 శాతం నిధులు కేటాయించలేరా? కేసీఆర్ అధికార మదాన్ని అణచివేయాలి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై పోరాడి చట్టాలను మోడీ వెనక్కు తీసుకునేలా చేసిన ఘనత రైతులది. మోదీ మెడలు వంచిన హర్యానా రైతుల స్ఫూర్తితో మీరంతా ఏకం కండి. మీరు రాజకీయ పార్టీల చుట్టూ తిరగనవసరం లేదు. ఏకమై పోరాడితే…మీ వెంటే రాజకీయ పార్టీలు వస్తాయి. ఫ్యాక్టరీ ఎట్ల తెరుచుకోదో.. పసుపు బోర్డు ఎట్ల రాదో చూద్దాం. మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల మేలుకె కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రభుత్వంలో ఆరు నెలల్లోపు చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత మాది. రాష్ట్రంలో చత్తీస్ ఘడ్ మోడల్ పాలన అవసరం. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 9వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా… వ్యవసాయ మంత్రి వస్తాడా, ఐటీ మంత్రి వస్తాడో మీ ఇష్టం. కాంగ్రెస్ పాలన… బీఆరెస్ పాలన పై చర్చ పెడదాం. మాది రైతులను ఆదుకునే విధానం.. బీఆరెస్ ది రైతు ఆత్మహత్యల విధానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X