పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “కేసీఆర్ ప్రభుత్వం పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం” అని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని పెర్కిట్ గ్రామం నుంచి ఆర్మూర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఆర్మూర్ పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.

గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఆర్మూర్ కు కీర్తి తెచ్చారు. సురేష్ రెడ్డికి కాంగ్రెస్ అన్నీ ఇచ్చింది.. స్పీకర్ ను చేసింది. కానీ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి సురేష్ రెడ్డి కాంగ్రెస్ కు అన్యాయం చేశారు. దొర గడీలో సురేష్ రెడ్డి బానిస బతుకు బతుకుతున్నారు. కాంగ్రెస్ ను నట్టేట ముంచినోళ్లు కొందరైతే… కాంగ్రెస్ కార్యకర్తలను చంపించి ఎమ్మెల్యే అయినవారు ఇంకొకరు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత ధనదాహానికి నందిపేట సెజ్ బలైపోయింది. బీడీలను నిషేధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పేద ఆడబిడ్డల పొట్ట కొట్టాయి. గుత్ప, శ్రీరాం సాగర్ నిర్మించి రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది కాంగ్రెస్.

బీఆరెస్ కారు స్టీరింగ్ అసద్ చేతిలో ఉంటే… బ్రేక్, ఎక్స్ రేటర్ కేసీఆర్, మోదీ చేతిలో ఉన్నాయా? దక్షిణాఫ్రికా నియంత ఈడీ అమీన్ ఉండేవాడు.. మనుషులను కోసుకుని తినేవాడట. మనుషుల రక్తం తాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ఈడీ అమీన్. ఎవరు లే అవుట్ చేసినా జీవన్ రెడ్డి సోదరులకు కప్పం కట్టాల్సిందేనట దుబాయ్ షేక్ లకే సున్నం పెట్టి వచ్చిన ఘనుడు జీవన్ రెడ్డి. ఈ ఎమ్మెల్యే తళారి సత్యంను చంపించిండు.
ప్రజలకు ఏమీ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉంటే.. రాష్ట్ర ప్రజలకు ఏమీ రావు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని అరవింద్ మోసం చేశాడు. కవితకు పట్టిన గతే అరవింద్ కు పట్టేలా చేయాలి.

కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఈ ప్రభుత్వం పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాలీలు భర్తీ చేస్తాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. చక్కెర పరిశ్రమ ముగిసిన అధ్యాయం అయితే.. కేసీఆర్ ది కూడా ముగిసిన చరిత్రనే.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తాం. ఇక్కడి గల్ఫ్ బాధితుల గోసలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రైతు బీమా మాదిరిగా గల్ఫ్ బీమా తీసుకొస్తాం. తద్వారా గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే తెలంగాణ కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమవుతుంది.

లక్కంపల్లి సెజ్ ను సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

పాదయాత్ర కోసం ఆర్మూర్ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ మండలంలో ఉన్న లక్కంపల్లి సెజ్ ను సందర్శించారు. సెజ్ లోని ఆగ్రో ఫుడ్ పార్క్ లో సంబంధిత సిబ్బందిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో పసుపు, మొక్కజొన్న, సొయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016 బీజేపీ ప్రభుత్వం చెప్పింది. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా ముందుకు తీసుకెళతామని ప్రభుత్వం మాట ఇచ్చింది.

ఓ తెలంగాణ పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చినా సీఎం అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే బెదిరించారు. టీఎస్ఐఐసీ నుంచి ఇక్కడ ఒక సూపర్ వైజర్ ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు. నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయింది. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదు. అభివృద్ధి జరగడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 30 శాతం కప్పం కట్టాల్సిందేనట.

అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు ఓడించండి. బీజేపీ ఎంపీ కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూడాలి. గతంలో పతంజలి కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కవిత పెద్ద ప్రచారం చేశారు. కానీ ఇప్పటికీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. రాందేవ్ బాబాతో మాట్లాడి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఇక్కడి ఎంపీ కృషి చేయాలి. తక్షణమే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై కేసీఆర్ రివ్యూ చేయాలి. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన దళిత ప్రజా సంఘాల జేఎసీ

పాదయాత్ర కోసం ఆర్మూర్ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దళిత ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం కలిసింది. దళితులపై అఘాయిత్యాలను నిరోధించడానికి, సంక్షేమ పథకాల అమలుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న నేతలు రేవంత్ కు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, సంక్షేమ పథకాల్లో అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయడంలేదని ఆయనకు విన్నవించుకున్నారు.

ఎమ్మెల్యేలను చక్రవర్తులను చేసి దళితులను అడక్కునే స్థాయికి దిగజార్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ కాన్ సెంట్ వల్ల పేద లబ్ది దారులకు న్యాయం జరగడంలేదన్న నేతలు. సమస్యలపై పోరాటానికి తనవంతు సహకారం అందిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో డ్రా విధానం తెస్తే అవినీతికి తావుండదన్న రేవంత్ అన్నారు. సబ్ ప్లాన్ అమలుపై న్యాయ పోరాటానికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

రేవంత్ రెడ్డిని కలిసిన గల్ఫ్ బాధితుల సంఘం

పాదయాత్ర కోసం ఆర్మూర్ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని శుక్రవారం గల్ఫ్ బాధితుల సంఘం కలిసింది. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏజెంట్ల మాటలు నమ్మి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లారన్నారు. ఈ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే గల్ఫ్ దేశాల ఉద్యోగ వివరాలు సేకరించాలి. ఇక్కడి నుంచే అప్లికేషన్ తీసుకుని శిక్షణ ఇప్పించాలి. గల్ఫ్ బాధితుల కోసం ఒక సంక్షేమ నిధిని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. ఎంత మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉందా? ఏజెంట్లకు కూడా ఒక లైసెన్స్ విధానం తీసుకురావాలి. గల్ఫ్ వెళ్లే కార్ముకుల వివరాలు సేకరించాకే అక్కడకు పంపించాలి.

కార్మికుల పక్షాన న్యాయ సలహాల కోసం ఒక న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అనుభవజ్ఞులకే ఏజెంట్ గా లైసెన్స్ అందిస్తాం. గల్ఫ్ వెళ్లే వారికి ప్రభుత్వమే శిక్షణ ఇప్పించేలా చేస్తాం. రైతు బీమా లా… గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా బీమా పథకం తీసుకొస్తాం. గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక విధానం తీసుకొస్తాం. ఈ అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి బాధితులను ఆదుకుంటాం. ముంబై, దుబాయ్, బొగ్గుబాయి పదాలను రాజకీయ అవసరాలకే వాడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X