Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా నిరసన కార్యక్రమాలు

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది.

కవిత అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “అరెస్ట్ అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేస్ పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే అరెస్ట్ చేశారు. శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది గనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బిజెపి మా శాసనమండలి సభ్యురాలిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే, కవిత అరెస్టు మీద ఇప్పటికే కేంద్ర మంత్రి సహా అనేక మంది బీజేపీ నాయకులు చాలామంది ప్రకటనలు చేశారు. ఈడి అధికారులు లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బిజెపి నాయకులు, బిజెపి కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు పలుమార్లు ప్రకటన చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు.

శనివారం పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుంది ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిసి కవితని అరెస్టు చేయడం అంటే ఇది మా బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డి మోరలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. తద్వారా ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రంలో కలిసి కుట్ర చేసాయి. అరెస్టులు గానీ వేధింపులు గానీ, కుట్రలు గానీ మాకు, బి ఆర్ ఎస్ కు కొత్త కాదు. ఇలాంటివి ఛేదించి తెలంగాణ రాష్ట్రం సాధించాం. 14 ఏళ్లు పోరాటం చేశాం. రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాము. సుప్రీం కోర్టులో అక్రమ అరెస్ట్ మీద కేసు వేసి లీగల్ గా ఫైట్ చేస్తాం.

సుప్రీం కోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం అంటే ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర. 19 వ తేదీ కేసు ఉంది కదా ఎందుకు అర్జెంట్ గా అరెస్ట్ చేయాలి. మహిళలను ఈడి అరెస్టు చేయొచ్చా, చేయొద్దా అనే అంశం కోర్టులో ఉంది. మమతా బెనర్జీ కుటుంబ సభ్యురాలి పైన, నలిని చిదంబరం పైన, కవిత గారి పైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే, మూడు రోజుల ముందే అరెస్టు చేయడం అంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీసే కుట్ర అని అర్థమవుతున్నది. ఎమర్జెన్సీ నియమించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది దౌర్జన్యంగా కవితని అరెస్టు చేశారు. గతంలో బిఆర్ఎస్ మంత్రులను ఎమ్మెల్యేలను బెదిరించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ప్రయత్నం కూడా చేశారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

ఈ అప్రజా స్వామీక చర్యలకు నిరసనగా, కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు ఇస్తున్నది. రాజకీయ ప్రేరేపితమైన అరెస్టు ఇది. కాంగ్రెస్ బిజెపిల దుర్మార్గపు చర్య. బిఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది. బిజెపి కాంగ్రెస్ లకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట అన్నారు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకొని వచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారం చేశారు. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చేశారు. ఒక పథకం ప్రకారం చేశారు. ఎవరెన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. అక్రమ కేసులు నిర్బంధాలు మా కొత్త కాదు. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం న్యాయపరంగా పోరాటం చేస్తాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ బిఆర్ఎస్ శ్రేణులు అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది.”

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్

కవిత అరెస్టును రాజకీయ కుట్రక్కోణంగానే చూస్తున్నాం. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన కవిత తన విధిగా హాజరయ్యారు విచారణకు సహకరించారు. సిమ్ కార్డులను కూడా సబ్మిట్ చేశారు. నిందితురాలు కాదని చెప్పి పంపినవారు ఏడాది తర్వాత ఈరోజు హడావుడిగా అరెస్టు చేయడం అంటే ఇది కుట్రలో భాగమే. ఇంతకు మించిన దుర్మార్గపు చర్యలేదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకున్నది.

సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇలా చేయడం అప్రజా స్వామికం. బిజెపి ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలపైన తన అధికారాన్ని ప్రయోగిస్తున్నది. లొంగదీసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది. ఎదురు నిలబడితే దౌర్జన్యం చేసి ఇలా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నది. ఈ బిజెపి విధానాలకు నిరసనగా నిరసన కార్యక్రమాలు చేపట్టారని పార్టీ తరఫున కోరుతున్నాం.

ఎమ్మెల్సీ కవిత అరెస్టు పైన కేటీఆర్ స్పందన

పదేళ్ల బిజెపి పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారింది. ఈడి ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

కవిత అరెస్టు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడి వ్యవహరించిన తీరుపైన రేపు సుప్రీంకోర్టు కు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కచ్చితంగా 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్న. ఈడి స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది. చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తాం.

ఎమ్మెల్సీ కవిత అరెస్టు పైన బీఎస్పీ పార్టీ స్పందన

బిఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, బిఆర్ఎస్ ఎంఎల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశాడు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు.

ఈ లాంటి అక్రమ అరెస్ట్ ల తో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేదా కాదు. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే. ఈడీ తో బిజెపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి తగిన బుద్ధి చెప్పబోతున్నారు. దేశంలో మోడి పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీని తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమం: ఎంపీ రవిచంద్ర లోకసభ ఎన్నికలకు ముందు రాజకీయ కక్షతోనే అరెస్టు: ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమమని, సుప్రీం కోర్టులో కేసు పెండింగులో ఉండగా రేపో ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో..ఈ డీ సోదాలపేరుతో అరెస్టు చేయడం తెలంగాణ ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. రాజకీయ సీరియల్ తలపించేలా ఇన్నిరోజులు విచారణ పేరుతో అయోమయానికి గురిచేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ తీరా లోకసభ ఎన్నికలకు ముందు అకారణంగా అరెస్టు చేయడం రాజకీయ కక్షలకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు. ఇది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేనన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకుపోయిన రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేసి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బీజేపీ జాతీయ నేతలు పన్నిన రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. రాజకీయ కుయుక్తులతో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మనోధైర్యాన్ని ఇంచుక మందం కూడా కదిలించలేరని, ఇటువంటి ఎన్నో ఆటుపోట్లను చూసిన ఉక్కుగుండె కేసీఆర్ ది అన్నారు. ఇటువంటి చర్యలకు బెదిరేదిలేదనీ, ఎంఎల్సీ కవితకు యావత్ తెలంగాణ సమాజం అండగా నిలుస్తుందని స్పష్టం చేసారు. ఈ వ్యవహారం పై చట్టసభల్లో న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు.

ఘనంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం నాడు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X