“మాట తప్పడం, మడమ తిప్పడ మే రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్”

హైదరాబాద్ : మాట తప్పడం, మడమ తిప్పడం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మంగళవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేందుకు ఉద్యోగులు బానిసలు కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదని, కాంగ్రెస్ సర్కార్ పని కూడా అయిపోయిందని తేల్చిచెప్పారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు సంతోషంగా, గౌరవంగా ఉండేలా చూస్తామని, వాళ్లను అభివృద్ధిలో డెవలపర్స్ గా చేస్తామన్నారు.

అది రేవంత్ ట్రేడ్ మార్క్

ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడం లేదని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చే డీఏలు, పీఆర్సీ, పెన్షన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే సమస్యలపై గత ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఎందుకు మేలు చేయడం లేదని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులను బెదితీస్తూ వాళ్ల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం బెదిరింపులకు భయపడేందుకు వాళ్లు బానిసలు కాదని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను అడిగే విషయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని కవిత భరోసా ఇచ్చారు.

పిల్ల కాంగ్రెస్ తో పోరాటం చేయడం ఓ లెక్క కాదు

తల్లి కాంగ్రెస్ తోనే పోరాడి తెలంగాణ తెచ్చుకున్న మనకు ఈ పిల్ల కాంగ్రెస్ తో పోరాటం చేయడం ఓ లెక్క కాదు అని అన్నారు. ఉద్యోగులకు గత 32 నెలలుగా ఆరు డీఏలు బకాయిలు పెట్టారని అన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిన కరవు భత్యాన్ని ఈ ముఖ్యమంత్రే మింగేశారన్నారు. ఏ ప్రభుత్వమైనా పారదర్శకమైన పాలన అందించాలంటే అందుకు ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని కవిత చెప్పారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ వారి పట్ల రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పడం, మడమ తిప్పడం అనేది రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని కవిత విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

Also Read-

టీచర్ల తో పెట్టుకున్న ప్రభుత్వాలు మళ్లీ గెలవలేదు

ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మళ్లీ గెలవలేదని కవిత గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మళ్లీ గెలవదని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క టీచర్, ప్రభుత్వ ఉద్యోగి కూడా సంతోషంగా లేరని చెప్పారు. ముఖ్యంగా టీచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి అమానుషంగా ఉందన్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వటం లేదని, డీఏ బకాయిలు పెండింగ్ పెడుతున్నారన్నారు. పైగా ఎప్పుడు ఏదో రిపోర్ట్ పేరుతో వాళ్లు చదువు చెప్పకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 40 శాతం పోస్టులు ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఉన్న టీచర్లను సరిగా చూసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2003 లో రిక్రూట్ అయిన టీచర్లకు ఓపీఎస్ అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. వారి పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ కు బదిలీ చేస్తే ప్రభుత్వానికి రూ. 2 వేల కోట్లు వస్తాయని చెప్పారు. ఈ విషయం కూడా ముఖ్యమంత్రి తెలియదని కవిత ఎద్దేవా చేశారు. వెంటనే వారిని ఓపీఎస్ కు మార్చి వచ్చే 2 వేల కోట్లతో ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.

18 లోగా సమస్యలు పరిష్కరించాలి

ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడని కవిత మండిపడ్డారు. కనీసం ఉద్యోగుల హెల్త్ కార్డు కూడా పనిచేయని పరిస్థితి ఉందన్నారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ లోనైనా హెల్త్ కార్డు చెల్లుబాటు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిన చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కవిత అన్నారు. ఒకవేళ హెల్త్ కార్డు పనిచేయకపోతే ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అంటూ కవిత ఛాలెంజ్ విసిరారు. పోలీసుల పరిస్థితి కూడా బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రావాల్సిన ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని…2003 లో రిక్రూట్ అయిన వారికి ఓపీఎస్ పెన్షన్ సిస్టం అమలు చేయాలన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా లేకుంటే పరిపాలన ఎక్కడికక్కడ పడకేస్తుందన్నారు. రాష్ట్రంలోని 206 ఉద్యోగ సంఘాలు జేఏసీ గా ఏర్పడి ప్రభుత్వం ముందుంచిన 37 డిమాండ్లలో చాలా వరకు డబ్బుతో సంబంధం లేనివేనని అన్నారు.

హైదరాబాద్ దిగ్భంధనానికి ఉద్యోగ సంఘాలు పిలుపు

317 జీవో సహా చాలా సమస్యలను ప్రభుత్వం సులభంగా పరిష్కరించే పరిస్థితి ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి భయపడి ధర్నాలను పోస్ట్ పోన్ చేసుకుంటుండంతో కిందిస్థాయి ఉద్యోగుల్లో ఉద్యోగ సంఘాలపై నమ్మకం లేకుండా పోతోందన్నారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదని కవిత భరోసా ఇచ్చారు. ఈ నెల 18 లోగా సమస్యలు పరిష్కారిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని కవిత గుర్తు చేశారు. ఒక వేళ 18 వ తేదీ లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే హైదరాబాద్ దిగ్భంధనానికి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వాలని కవిత కోరారు. వారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన రానున్న రోజుల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను డెవలపర్స్ పార్టనర్స్ చేస్తామన్నారు. వారంతా సంతోషంగా ఉండేలా వారిని గౌరవించుకుంటామన్నారు.

ఉద్యోగ సంఘాలు కూడా నష్టం చేస్తున్నయ్

ఉద్యోగులకు మేలు చేయాల్సిన సంఘాలు కూడా ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి నష్టం చేస్తున్నాయని టీఎస్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అడిగితే కేసులు పెట్టారని…ఈ ప్రభుత్వంలో అన్ని ఇస్తామంటూ ఏమీ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్న నమ్మకం తమకుందని ఆయన చెప్పారు. అటు ఆర్టీసీ లో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉందని…దాదాపు 16 గంటలు వారితో పనిచేయిస్తున్నారన్నారని ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల నాయకులు సంజవ్ చెప్పారు. ఈ విధానం మారే విధంగా పోరాటం చేయాలని కవితకు ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న కారణాలకే ఉద్యోగాల నుంచి తొలగించిన చాలా మందిని కవిత పోరాటం కారణంగానే మళ్లీ ఉద్యోగాలకు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఐతే ఆర్టీసీ లో శ్రమ దోపిడీ లేకుండా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, టీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి శ్రీనివాస్, కనిష్క మహేందర్ రెడ్డి, విద్యావేత్త ధరణి రాణి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X