హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్ రావు వాజ్పేయి దేశానికి అందించిన విశిష్ట సేవలను, వారి ఆదర్శవంతమైన జీవన ప్రస్థానాన్ని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాంచందర్ రావు.., “వాజ్పేయి దాదాపు ఆరేళ్లకు పైగా ప్రధానిగా దేశాన్ని సమర్థవంతంగా నడిపించారు. వారి హయాంలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణం, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు, సామాన్యులకు సైతం గ్యాస్ కనెక్షన్లు సులభంగా అందేలా చేయడం వంటి సంస్కరణలు దేశాభివృద్ధికి బలమైన పునాది వేశాయి. భారత రాజకీయ చరిత్రలో వాజ్పేయి పరిపాలనా కాలాన్ని ఒక ‘స్వర్ణయుగం’గా పరిగణిస్తారు” అని పేర్కొన్నారు.

అలాగే, వాజ్పేయి పాటించిన విలువలతో కూడిన రాజకీయాలను ప్రస్తావిస్తూ, “పార్లమెంటులో కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ, నైతిక విలువలకు కట్టుబడి రాజీపడకుండా నిలిచిన మహోన్నత నాయకుడు ఆయన. అధికారం కంటే ప్రజాస్వామ్య విలువలకే వాజ్పేయి అగ్రతాంబూలం ఇచ్చారు. నేటి తరం రాజకీయ నాయకులు, యువత ఆ ఉన్నతమైన విలువల నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని స్పష్టం చేశారు.
Also Read-
“జీవితాంతం దేశ సేవకే అంకితమైన వాజ్పేయి నిస్వార్థ దేశభక్తి, అంకితభావాన్ని గుర్తించి గౌరవప్రదానంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వారికి దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. వాజ్పేయి భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి ఆశయాలు, సిద్ధాంతాలు నిరంతరం ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. నేటి యువతరం వారి జీవిత చరిత్రను అధ్యయనం చేసి, వారి చూపిన మార్గంలో నడవడమే వారికిచ్చే నిజమైన నివాళి” అని పిలుపునిచ్చారు.
