హైదరాబాద్: నాగోల్లోని స్నేహపురి కాలనీలో గల మహదేవ్ జ్యువెలర్స్లో కాల్పులు జరిపి నగల దోపిడి ఘటనలో దొంగలు ఇంకా ఆచూకీ తెలియలేదు. 17 ప్రత్యేక బృందాలతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పక్కా స్కెచ్లు వేసి దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. దుండగులు నంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చి కస్టమర్లంటూ దుకాణంలోకి ప్రవేశించినట్లు విచారణలో తేలింది. నాగోల్ స్నేహపురి కలానీలోని మహదేవ్ జువెలర్స్లో గురువారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దొంగలు 2 కిలోల బంగారు నగలు, 1.70 లక్షల నగదుతో పారిపోయారు.
షాపు యజమాని కళ్యాణ్ చౌదరి, బంగారు ఆభరణాల సరఫరాదారు సుఖ్దేవ్లు తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బాధితులిద్దరినీ కలిసి మాట్లాడారు. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల సమీపంలోని లాడ్జీలు, రెస్టారెంట్లలో సోదాలు చేశారు.
2018 సెప్టెంబర్లో మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో ఇదే తరహాలో దోపిడీకి ప్రయత్నించారు. నాగారంలోని ఆర్ఎస్ రాథోడ్ జ్యువెలర్స్ సమీపంలోకి ఆరుగురు దొంగలు మూడు బైక్లపై వచ్చారు. ఇద్దరు దుండగులు తుపాకీతో దుకాణంలోకి ప్రవేశించగా, నలుగురు దుకాణం వెలుపల ఇరువైపులా నిలబడి ఉన్నారు. లోపలికి వెళ్లిన దుండగులు 15 వేల బంగారు గొలుసు కావాలని యజమాని వద్దకు వెళ్లి తుపాకీని తీశారు. ఇంతలో షాపు ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులిద్దరూ పారిపోయారు. ఇప్పుడు కూడా అదే తరహాలో దోపిడీ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
ఇది అంతర్రాష్ట్ర ముఠా పని కావచ్చు. నలుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. దొంగలు ఉపయోగించిన నంబర్ ప్లేట్లు లేని రెండు బైక్లు చోరీకి గురైనట్లు తేలింది. గురువారం సాయంత్రం సుఖ్దేవ్ తన యజమాని రాజ్కుమార్తో కలిసి సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ నుంచి బయలుదేరినప్పుడు నలుగురు దొంగలు అతని బైక్ను వెంబడించారు. బాధితులు నాచారం, బోడుప్పల్, పనామా, వనస్థలిపురంలోని నగల దుకాణాలకు నగలను డెలివరీ చేశారు. ఈ సమయంలో 1.70 లక్షలు వసూలు చేశారు. రాత్రి 9.15 గంటలకు నాగోల్లోని మహదేవ్ జ్యువెలర్స్ వద్దకు వెళ్లగా, దుండగులు వారిని వెంబడించి లోపలికి వెళ్లారు. దుకాణంలో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో దుండగులు కాల్పులు జరిపి నగలు, డబ్బును దోచుకెళ్లారు. (Agencies)