హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో 3 ఆగస్టు న జోన్ (సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్లు) మొత్తంలో భారీ టికెట్ తనిఖీ డ్రైవ్న నిర్వహించబడింది. రోజంతా జరిగిన ఈ డ్రైవ్లో, 186 మంది టికెట్ తనిఖీ సిబ్బంది పాల్గొని 169 రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులు, అనధికారంగా ప్రయాణించేవారు మరియు బుక్ చేయని లగేజీని తీసుకువెళ్లే ప్రయాణికులను గుర్తించడంపై ఈ తనిఖీలో ప్రధానంగా దృష్టి సారించారు. రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేసే ప్రయాణికులు, రైల్వే ప్రాంగణంలో చెత్త వేసేవారు మరియు అనధికారికంగా వస్తువులు అమ్మడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానా విధించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ డ్రైవ్లో భాగంగా, టిక్కెట్టు లేకుండా/ అనధికారంగా ప్రయాణిస్తున్న మరియు అలాగే బుక్ చేయని లగేజీని కలిగి ఉన్న 4121 మంది ప్రయాణికులను గుర్తించి, టిక్కెట్టు తనిఖీ ద్వారా రూ. 30.53 లక్షల ఆదాయాన్ని వసూలు చేయడమైనది. అదనంగా, చెత్త వేసినందుకు 35 మంది ప్రయాణికులకు రూ. 7300 జరిమానా విధించారు. అలాగే, రైల్వే ప్రాంగణంలో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న 19 మంది వ్యాపారులపై చర్యలు తీసుకుని, రూ.38,000 జరిమానా మరియు ధూమపానం చేస్తున్న ఇద్దరు ప్రయాణికులకు రూ. 4000 జరిమానా విధించారు.

ఈ డ్రైవ్ సందర్భంగా, టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ ఉల్లంఘనలకు విధించే జరిమానాల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రైళ్లలో మరియు రైల్వే ప్రాంగణాలలో ధూమపానం చేయడం వల్ల కలిగే అగ్ని ప్రమాదాల గురించి కూడా ప్రయాణికులకు తెలియజేశారు. అదనంగా, రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో పరిశుభ్రతను కాపాడేందుకు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, బాధ్యతయుతమైన పౌరులుగా మంచి పౌర పద్ధతులను పాటించడం ద్వారా రైల్వే స్టేషన్లు మరియు రైళ్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడాలని వారిని కోరారు.
Also Read-

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, విస్తృతమైన టికెట్ తనిఖీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మరియు జరిమానాల గురించి ప్రయాణికులలో అవగాహన కల్పించినందుకు వాణిజ్య విభాగాన్ని ప్రశంసించారు. రైల్వేలో టికెట్ తనిఖీ కీలక పాత్ర పోషిస్తుందని, ఇది టికెట్ లేని మరియు అనధికారిక ప్రయాణాలను అరికట్టడంలో, నిజమైన ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించడంలో మరియు రైల్వే వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే, సురక్షితమైన, భద్రమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాలు అందరి ఉమ్మడి బాధ్యత కాబట్టి, ప్రయాణికులు సరైన మరియు చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో ప్రయాణించాలని, టికెట్ తనిఖీ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది.
