హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన జిల్లా స్థాయి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ తరగతులు – 2026 కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం తీవ్రమైన అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురైందని పేర్కొన్నారు.

భారతదేశంలో కేవలం 10 శాతం మేర మాత్రమే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుండగా, మిగతా అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ, భారత్లో మాత్రం ఇంధన ధరల పెరుగుదల చాలా పరిమితంగానే ఉండటం కేంద్ర ప్రభుత్వ సమర్థ నిర్వహణకు నిదర్శనమన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరగగానే కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ విమర్శలకు దిగుతున్నాయని విమర్శించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించకుండా కేవలం రాజకీయ లాభాల కోసం భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్య రాజకీయమని అన్నారు.


ప్రపంచ దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయని, యూరప్లోని పలు దేశాల్లో 15 శాతం నుంచి 26 శాతం వరకు ధరలు పెరిగాయని తెలిపారు. ఐర్లాండ్లో డీజిల్ ధరలు 28 శాతం, పెట్రోల్ ధరలు 25 శాతం వరకు పెరిగాయని చెప్పారు. పాకిస్థాన్లో పరిస్థితి మరింత దారుణంగా మారి డీజిల్ ధరలు 54.9 శాతం, పెట్రోల్ ధరలు 42.7 శాతం వరకు పెరిగాయని గుర్తుచేశారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో అక్కడి ప్రభుత్వం సబ్సిడీలు కొనసాగించడం సాధ్యం కాదని స్వయంగా ప్రకటించిందన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగిన సమయంలో కూడా భారత్లో కేవలం సుమారు రూ.3 మేర మాత్రమే పెంపు జరగడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ ముందుచూపు, ఇంధన భద్రతపై తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల ఫలితమని పేర్కొన్నారు.
Also Read-

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, కానీ యూపీఏ హయాంలో చేసిన ఆర్థిక దుర్వినియోగ భారాన్ని దేశం ఇప్పటికీ భరిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన సమయంలో కూడా ప్రజలకు ఉపశమనం ఇవ్వకుండా “ఆయిల్ బాండ్లు” పేరిట లక్షల కోట్ల అప్పులను భవిష్యత్ తరాలపై మోపిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పులు చేసి, అసలు భారాన్ని తరువాతి ప్రభుత్వాలపై నెట్టివేయడం కాంగ్రెస్ వైఖరని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. దివంగత సుష్మాస్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బలమైన మద్దతు తెలపకపోయి ఉంటే తెలంగాణ సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. తెలంగాణను తామే ఇచ్చామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెప్పుకుంటున్నప్పటికీ, బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పాటే జరిగేది కాదనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
