హైదరాబాద్ : నిరంతరం పుస్తకాలను చదవడం ద్వారా విజ్ఞానాన్ని పొందొచ్చని, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనల చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని న్యాక్ మాజీ డైరెక్టర్, డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. వి. ఎస్. ప్రసాద్ పేర్కొన్నారు. “విద్యా వారోత్సవాల్లో” భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో “బుక్ టాక్” అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొ. వి. ఎస్. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం అయన మాట్లాడుతూ “రాజ మోహన్ గాంధి రాసిన “డు యు నో యువర్ హిందూహిజం” (DO YOU KNOW YOUR HINDUISM) అనే పుస్తకం ఇటీవల చదివానని పేర్కొంటూ అందులో ప్రస్తావించిన అంశాలను వివరించారు. ఆ పుస్తకం లో రచయిత చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాశారని వివరించారు. భారత దేశం లౌకిక దేశంగా పేర్కొంటూ దేశంలో బిన్న మతాల ప్రజలు ఉంటారని, ఎవరి మతాన్ని వారు గౌరవించడంలో తప్పు లేదని అయితే ఇతర మతస్తుల అభిప్రాయాలకు, మనోభావాలను దెబ్బతీయకుండా ప్రవర్తించాలన్నారు. నిజమైన హిందూహిజం అనేది ఇతరులను గౌరవిస్తూ ఇతర మతస్థులను, వారి వారి ఆచారాలను, నమ్మకాలను కూడా సమానంగా చూడాలని చెప్పుతోందని ఆ విషయాన్ని రచయిత ఈ పుస్తకంలో విపులంగా వివరించారని ప్రొ. ప్రసాద్ వెల్లడించారు.

కార్యక్రంలో విశిష్ట అతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత రచయిత టి. ఎం. కృష్ణ రాసిన “వుయ్ ద పీపుల్ అఫ్ ఇండియా : డీ కోడింగ్ ఏ నేషన్స్ సింబల్స్” ( WE THE PEOPLE OF INDIA : DECODING A NATION’S SYMBOLS) అనే పుస్తకం తాను ఇటీవల చదివానని పేర్కొంటూ అందులో ప్రస్తావించిన పలు అంశాలను ప్రొ. జి. హరగోపాల్ వివరించారు. జాతీయ జెండా గురించి, అశోక చక్రం గురించి, జాతీయ గీతం, రాజ్యంగా పీటిక, వందేమాతరం వంటి అంశాల్లో దేశంలో నివసించే పలు మతాల ప్రజలకు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని పుస్తకంలో వివరంగా ప్రస్తావించారని వెల్లడించారు. ఈ తరం విద్యార్ధులు దేశంలో జరుగుతున్న పరిణామాలను అర్ధం చేసుకోవాలన్నా, చరిత్రను తెలుసుకోవాలన్నా పుస్తకం చదవడం అలవరచుకోవాలని ప్రొ. జి. హరగోపాల్ సూచించారు. రచయిత ఈ పుస్తకం రాసే ముందు చాలా పరిశోధన చేసినట్లు అనిపించిందని వివరించారు.
Also Read-
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. విద్యార్ధులు నిరంతరం అధ్యయనం చేసే క్రమంలో లైబ్రరీలకు వెళ్ళాలని తద్వారా అటు పరిశోధనలో ఇటు విజ్ఞానం పొందడంలో ఉపకరిస్తుందని వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి చలం సాహిత్యం గురించి పేర్కొంటూ చలం ఆ రోజుల్లో రాసిన సాహిత్యం ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉండడం చాలా గొప్ప విషయం అని వెల్లడించారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. యల్. విజయా కృష్ణా రెడ్డి; లైబ్రరీ డైరెక్టర్ ప్రొ. రజని, ప్రొ. ఏ.ఆర్.డి. ప్రసాద్, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొ. పల్లవి కబ్డే, ప్రొ. పి. వెంకట రమణ, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
