హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SSR) ప్రక్రియ గడువును, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ గడువును పొడిగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్వాగతించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు మీడియాతో మాట్లాడుతూ..ఈ గడువు పొడిగింపునకు సహకరించిన కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (CEO) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రంలో ఓటర్ల సవరణ (SSR) ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మరియు సేకరణ గ్రౌండ్ లెవెల్లో అత్యంత మందకొడిగా సాగుతున్న విషయాన్ని బీజేపీ శ్రేణులు గుర్తించాయని అశోక్ గారు తెలిపారు. బీఎల్ఓ (BLO) అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి ఫారాలు ఇవ్వడం, తిరిగి ఓటర్ల నుండి సేకరించడం తీవ్ర జాప్యంతో సాగుతోందని వివరించారు. దీనిపై వెంటనే స్పందించి, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తూ బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO)కి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేయడం జరిగిందన్నారు. బీజేపీ విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించి, ఈసీఐ వెంటనే గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
పొడిగించిన నూతన షెడ్యూల్ వివరాలు:
బీజేపీ అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఎస్ఎస్ఆర్ షెడ్యూల్ను కింది విధంగా పొడిగించింది: గతంలో ఈ నెల (జూలై) 25వ తేదీ వరకు ఉన్న గడువును వచ్చే నెల (ఆగస్టు) 3వ తేదీ (03-08-2026) వరకు పొడిగించారు.
Also Read-
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీఎల్ఓలకు సరైన పని వాతావరణాన్ని కల్పించలేకపోయిందని అశోక్ గారు ఆరోపించారు. ఓటర్ల సవరణ వంటి అత్యంత కీలకమైన విధుల్లో ఉన్న బీఎల్ఓలను ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు పంపించడం వల్లే ఈ ప్రక్రియ మందకొడిగా సాగిందని, దీనివల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త విధానాలన్నింటినీ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి (CEO) దృష్టికి తీసుకువెళ్లిందన్నారు.
ఈ గడువు పొడిగింపు తెలంగాణ ఓటర్లందరికీ ఒక మంచి శుభసూచకమని వేముల అశోక్ గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్క అర్హుడైన ఓటరుకు తమ ఓటు హక్కు దక్కేలా ఈ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ వరకు సాగే ఈ బృహత్ కార్యం లో తెలంగాణలోని ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని బీజేపీ తరఫున విజ్ఞప్తి చేశారు. బీజేపీ చేసిన విజ్ఞప్తికి తక్షణమే స్పందించి గడువు పొడిగించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేశారు.
