హైదరాబాద్ : రైల్వే బోర్డు చైర్మన్ మరియు ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సి.ఈ.ఓ) శ్రీ సతీష్ కుమార్ గారు ఈరోజు అనగా 2026 జూలై 5న కాజీపేట్ లోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మరియు చర్లపల్లి టెర్మినల్, జనగాం అమృత్ స్టేషన్ మరియు ఇరిసెట్ లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ; సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా. ఆర్. గోపాలకృష్ణన్ గారు మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు.

సతీష్ కుమార్ గారు కాజీపేట రైల్వే స్టేషన్ నుండి తనిఖీని ప్రారంభించారు. అక్కడ పురోగతిలోనున్న అమృత్ స్టేషన్ పనులను సమీక్షించడంతో పాటు, స్టేషన్లోని సౌకర్యాలను కూడా తనిఖీ చేశారు. కాజీపేటలోరూ.597.68కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను సందర్శించారు. ఈ ఆర్.ఎమ్.యూ వివిధ రకాల ఆధునిక రోలింగ్ స్టాక్ మరియు నెక్స్ట్-జెన్ రైల్వే కోచ్లను తయారు చేయడానికి మరియు వాటికి నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి ఉద్దేశించబడింది. రైల్వే బోర్డు ఛైర్మన్, ఆర్.ఎమ్.యూ లో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.

ఆర్.వి.ఎన్.ఎల్ అధికారులు సైట్ కార్యాలయంలో అందుబాటులోనున్న మినియేచర్ మోడల్ను ప్రదర్శిస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క భౌగోళిక స్వరూపాన్ని వివరించారు. ప్రతి యూనిట్ యొక్క కార్యాచరణ మరియు పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు. ఇంకా, ఆయన మెయిన్ షెడ్, బోగీ షాప్, పెయింట్ షాప్, వీల్ షాప్ మరియు టెస్టింగ్ షాప్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా, ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడి, ఆర్.ఎమ్.యూ లో జరుగుతున్న పనుల పురోగతి మరియు దాని ప్రయోజనాల గురించి వివరించారు.
Also Read-

తరువాత, చైర్మన్ మరియు సీఈఓ కాజీపేట నుండి చర్లపల్లి వరకు మార్గమధ్యంలో తనిఖీ నిర్వహించారు. మార్గమధ్యంలో ఆయన జనగాం రైల్వే స్టేషన్ను కూడా తనిఖీ చేసి, ప్రయాణీకుల సౌకర్యాలు, సర్క్యులేటింగ్ ఏరియా మరియు కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులను సమీక్షించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో, సతీష్ కుమార్ కొత్త రైలు టెర్మినల్లోని ట్రాక్లు, పాయింట్లు మరియు క్రాసింగ్లు, యార్డ్ మరియు ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఆయన చర్లపల్లి టెర్మినల్లోని ట్రాక్మెన్ మరియు గ్యాంగ్మెన్లతో కూడా సంభాషించి వారి విధుల గురించి చర్చించారు.

అదనంగా, సతీష్ కుమార్ ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ మరియు టెలికమ్యూనికేషన్స్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సందర్శించారు. అక్కడ ఆయన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ-కొలిజన్ సిస్టమ్ అయిన కవచ్ అమలులో పాల్గొన్న అధికారులతో సంభాషించారు. అంతేకాకుండా, భారతీయ రైల్వేలో ‘కవచ్ 4.0’ అమలు తీరుపై సంబంధిత అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా వివరించారు.

అనంతరం, సీఆర్బీ మరియు సీఈఓ రైల్ నిలయం, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులతో సవివరమైన పనితీరు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు జోన్ యొక్క సాధారణ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

