హైదరాబాద్ : సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ఈ రోజు నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ల నిర్వహణలో భద్రత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. అసురక్షిత పరిస్థితులను నివారించడంలో కనబరిచిన అంకితభావం మరియు అప్రమత్తతకు గుర్తింపుగా పద్నాలుగు మంది ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ “ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను అందజేశారు.

ఈ సమావేశంలో ఎస్సిఆర్ అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్తో పాటు అన్ని విభాగాల ప్రధాన అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు మరియు నాందేడ్ డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డిఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

విధుల పట్ల అప్రమత్తత, సమయపాలన, పరిపూర్ణత మరియు అంకితభావాన్ని అభినందిస్తూ ట్రాక్ మెయింటెనర్లు, పాయింట్స్ మ్యాన్, టెక్నీషియన్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు మరియు లోకో పైలట్లతో కూడిన ఫ్రంట్లైన్ సిబ్బందికి ఈ అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతల డివిజన్ల వారీగా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
Also Read-

సికింద్రాబాద్ డివిజన్ – 01, విజయవాడ డివిజన్ – 02, గుంటూరు డివిజన్ – 02, హైదరాబాద్ డివిజన్ – 03, నాందేడ్ డివిజన్ – 01 మరియు గుంతకల్ డివిజన్ – 05. అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, జనరల్ మేనేజర్ విధుల నిర్వహణలో వారి అంకితభావాన్ని మరియు చిత్తశుద్ధిని ప్రశంసించారు. ఇటువంటి గుర్తింపు ఇతర ఉద్యోగులను కూడా అప్రమత్తంగా ఉండటానికి మరియు రైలు కార్యకలాపాలలో భద్రతా ప్రమాణాలను కాపాడటానికి ప్రేరేపిస్తుందని మరియు ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జోన్ చేపట్టిన ముందస్తు జాగ్రత్తలను సమీక్షించారు. అగ్నిమాపక భద్రతా చర్యలపై దృష్టి సారించాలని మరియు సిబ్బందికి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు. ప్రమాదాలను నివారించడానికి సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలను పునరుద్ఘాటించాలని, సిబ్బందిచే ఖచ్చితమైన నిబంధనల అమలును నిర్ధారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఫైర్ మరియు స్మోక్ డిటెక్టివ్ సిస్టమ్ (మంటలు మరియు పొగను గుర్తించే వ్యవస్థ) మరియు దాని నిర్వహణలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా రైలు మార్గాల పక్కన (ట్రాక్సైడ్) పెట్రోలింగ్ను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. రైళ్లలో అగ్ని ప్రమాదాల ముప్పుపై సమగ్ర విశ్లేషణ జరపాలని మరియు అగ్ని ప్రమాదాలను నివారించడానికి నివారణ చర్యలను అమలు చేయాలని ఆయన సూచించారు, అలాగే సవాలుతో కూడిన వేసవి నెలల్లో అప్రమత్తత మరియు సంసిద్ధత యొక్క అవసరాన్ని హైలైట్ చేశారు.
అంతేకాకుండా, ప్రైవేట్ సిడింగ్లు, గూడ్స్ షెడ్ల వద్ద సిసిటివి కెమెరాల ఏర్పాటును జనరల్ మేనేజర్ సమీక్షించారు మరియు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ట్రెస్పాసింగ్ అవకాశం ఉన్న కొన్ని ప్రాంతాలలో ట్రాక్ ఫెన్సింగ్ ను జనరల్ మేనేజర్ సమీక్షించారు మరియు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
