హైదరాబాద్: జీవో నంబర్ 317 బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర జీవో 190 ని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ మేరకు శుక్రవారం వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. వెంటనే 190 జీవో అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఎన్నికలకు ముందు 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ…అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నకూడా ఈ ప్రభుత్వానికి గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. ఉద్యమకారులు, ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు.
317 జీవో బాధితులకు న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ విషయంలో ముందడుగు వేయటం లేదో చెప్పాలన్నారు. 317 బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు స్థానికత ఆధారంగా బదిలీలు చేస్తామని చెప్పి దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ వేశారని…ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన 190 జీవో ను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. 317 జీవో బాధితులైన టీచర్లకు స్థానికత ఆధారంగా బదిలీలు చేస్తామని చెప్పారని…అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కూడా సృష్టిస్తామని హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు.
కానీ 190 జీవో తెచ్చి తొమ్మిది నెలలు గడిచినా దానిని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఎవరి కోసం, ఏ పైరవీ కోసం ఈ జీవోను అమలు చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 190 జీవో గడువే మూడేళ్లు ఉందని ఇప్పటికే 9 నెలలు గడిచిపోయిందని ఇంకెప్పుడూ అమలు చేస్తారని ప్రశ్నించారు.
Also Read-
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా టీచర్లు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కవిత అన్నారు. 317 జీవో కారణంగా వారంత స్థానికత కోల్పోయారని చెప్పారు. జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా వెంటనే 190 జీవోను అమలు చేయాలని కవిత కోరారు. అవసరమైతే టీచర్ల కోసం సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తోన్న తాత్సారంపై ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని కవిత పిలుపునిచ్చారు. టీచర్లు, ఉద్యోగుల హక్కుల కోసం వారి తరఫున తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని కవిత చెప్పారు. వెంటనే 190 జీవో అమలు పై చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు.
