నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నడికొండ మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. సాగర్ పైలాన్ క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను అక్రమంగా కూల్చేశారు. అదే స్థలంలో ఉన్న ఇతర పార్టీల జెండా గద్దె జోలికి వెళ్లకుండా టీఆర్ఎస్ జెండా గద్దెను మాత్రమే కూల్చేశారు. ఈ చర్యపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. నడికొండ మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎందుకంత వణుకు?
సాగర్ పైలాన్ క్రాస్ రోడ్డు వద్ద అన్ని పార్టీల జెండా గద్దెలు ఉన్నప్పటికీ ఒక్క టీఆర్ఎస్ జెండా గద్దెనే టార్గెట్ చేయటమేమిటనీ టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. నడికొండ మున్సిపల్ కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుండాల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు పార్టీ జెండాను గద్దెను కూల్చేశారని ఆరోపించారు. గత నెల 20 తారీఖు నుంచి టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహిస్తున్నామని రాష్ట్రంలో ఎక్కడ లేని సమస్య ఇక్కడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అంటే ఎందుకంతా వణుకు అంటూ నిలదీశారు.
Also Read-
పోలీసులతో వాగ్వాదం
మున్సిపల్ అధికారుల తీరుపై నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇంఛార్జ్ విక్రాంత్ రెడ్డి, నాగార్జున సాగర్ ఇంఛార్జ్ బాలు నాయక్, నాగార్జున సాగర్ అబ్జర్వర్ బోడుపల్లి లింగం, దేవరకొండ ఇంఛార్జ్ శివ నాయక్, నల్గొండ ఇంఛార్జ్ డి. సరిత, నల్గొండ అబ్జర్వర్ బొల్లంపల్లి సందీప్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు ఉమ మహేశ్వరీ, సోమయ్య, కిషోర్, మంగయ్య, సైది, చందర్ భామిని, చతు లు మండిపడ్డారు.
మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన టీఆర్ఎస్ నాయకులను శాంతిపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారితో వాగ్వాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈ దుర్మార్గానికి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమాలను ప్రజలను గమనిస్తున్నారని తప్పకుండా వారికి సరైన సమయంలో బుద్ది చెప్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ గద్దె కూల్చిన చోటే మళ్లీ పార్టీ గద్దె ను నిర్మిస్తామన్నారు.
