హైదరాబాద్ : విద్యా వారోత్సవాలలో భాగంగా బుధవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో “స్పోర్ట్స్ అండ్ వెల్బీయింగ్ డే” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా వారోత్సవాల సందర్భంగా ఇన్నోవేషన్, ఇన్క్లూజన్, ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్, అవుట్రీచ్ అంశాలను ప్రధాన థీమ్లుగా ప్రకటించిందని, విశ్వవిద్యాలయం ఇప్పటికే వాటి అమలు దిశగా పలు కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. విద్యార్థులు, సిబ్బంది అభివృద్ధికి వినూత్న అకాడమిక్ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, క్రీడా మైదానాలు, ఓపెన్ ఎయిర్ జిమ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాలికలు రూపొందించామని, వాటిని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో ఆన్లైన్ కోర్సులను ప్రారంభించనున్నామని వెల్లడించారు. అవుట్రీచ్ కార్యక్రమాల ద్వారా విద్య అందని వర్గాలకు విద్యను చేరవేయడానికి అవసరమైన చర్యలు చేపడుతూ ముందుకు వేల్లుతున్నట్లు వెల్లడించారు. గతంలో రాష్ట్ర డీజీపీ హోదాలో ఉన్నప్పటికీ ఒక గొప్ప మానవతావాదిగా పేరు ప్రఖ్యాతలు శివధర్ రెడ్డి తెచ్చుకున్నారని పేర్కొంటూ మావోలతో జరిగిన సంగటనలను ఉదహరించారు. దేశం అంతటా మావోయిస్టుల ఏరివేత చేపడితే శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో తెలంగాణా రాష్ట్రంలో లొంగుబాటులు జరిగాయని వివరించారు.
ఇదే క్రమంలో విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలను చదువుతో సమన్వయం చేయడం అత్యంత అవసరమని తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారు (SSA) మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి అన్నారు. గతంలో క్రీడలను చదువుతో పోలిస్తే ద్వితీయ స్థానంలో చూసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని పేర్కొన్నారు. క్రీడాకారులు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలకు ప్రతీకలుగా నిలుస్తున్నారని, ఇది శుభ సూచకమని ఆయన వివరించారు. క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని శివధర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.

యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు విధానాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. “యంగ్ ఇండియా స్కూల్స్” వంటి కార్యక్రమాలు విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిచ్చే ఉత్తమ ఉదాహరణలని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల ఆరోగ్యవంతమైన, ఆత్మవిశ్వాసం కలిగిన, ప్రగతిశీల యువతను తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయని శివధర్ రెడ్డి వివరించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇటీవల వినూత్నంగా తీసుకుంటున్న నిర్ణయాలు నాణ్యమైన విద్య అందరికీ అందించడానికి.
గౌరవ అతిథి ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి, డైరెక్టర్ (అకాడమిక్) మాట్లాడుతూ విద్య అందని వర్గాలకు చేరువయ్యేలా విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలను చేపడుతోందన్నారు. విశ్వవిద్యాలయాన్ని డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. నవీనత, విద్యా ప్రామాణికత, అవుట్రీచ్ కార్యక్రమాల ద్వారా ఇతర విశ్వవిద్యాలయాలతో పోటీ పడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పల్లవి కబ్డే, నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, డీన్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
