మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీదే తుది నిర్ణయమని పీసీసీ చెప్పడం సిగ్గుచేటు
సచివాలయంలో ఏఐసీసీ ఇంఛార్జీ రివ్యూ చేయడమా?
తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది
తెలంగాణ సొమ్మును దోచుకుని ఢిల్లీకి కప్పం కడుతున్నారు
అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది
కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని మండిపడ్డారు. సచివాలయం నుండి ఏఐసీసీ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసీసీ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటన్నారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు? ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారం. కానీ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడమేంది? సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడమేంది? తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’ మండిపడ్డారు.
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ తొలుత తన నివాసంలో, ఆ తరువాత కరీంనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…
దేశ ప్రజలకు, కార్యకర్తలందరికీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొడుకులు, అవమానాలను అధిగమించిన పార్టీ బీజేపీ. వేలాది మంది కార్యకర్తల బలిదానాలు, లక్షలాది మంది పోరాటాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ. జాతీయ భావజాలం, సిద్ధాంత బలమే బీజేపీ ఈ స్థాయికి చేరింది. 2019లోనే బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీగా అవతరించింది. 16 రాష్ట్రాల్లో సొంతంగా, 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తున్నం.
Also Read-
వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశ సత్తా చాటినం.స్వర్ణ చతుర్భుజీ పేరుతో జాతీయ రహదారులను విస్తరించిన ఘనత బీజేపీదే. చిట్టచివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న దీన్ దయాళ్ ఆశయాలను కొనసాగిస్తున్నాం.
మోదీ పాలనలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అద్బుత ఫలితాలను కనబరుస్తోంది. అభివ్రుద్ధి, సంక్షేమంలో దేశం దూసుకుపోతోంది. కేంద్ర సంక్షేమ పథకాలను పూర్తిగా తెలంగాణలో అమలు చేయడం లేదు.అన్ని రాష్ట్రాలను సమాన థ్రుక్పథంతో చూస్తూ అభివ్రుద్ధి చేస్తున్న ప్రభుత్వం మోదీదే.
రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఇచ్చేది మోదీ బియ్యమే. కిలోకు రూ.37 లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మోదీదే. సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.10 లే. అట్లాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో ఎందుకు పెట్టకూడదు?. రూ.10లకు కిలో సన్నబియ్యం ఎక్కడైనా వస్తాయా?. ఆ విషయాన్ని తెలుసుకుని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడితే మంచిది. బీజేపీ కార్యకర్తలారా….గ్రామగ్రామాన తిరిగి ప్రజలకు రేషన్ బియ్యంపై వాస్తవాలు వివరించండి. వడ్ల కొనుగోలు నుండి బియ్యం దాకా ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోంది. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ ఎవరు చెల్లిస్తున్నారో చెప్పాలి.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది. 6 గ్యారంటీలకు దిక్కులేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారారు. జన్ పథ్, గాంధీభవన్ ద్వారా పాలనను కొనసాగిస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరం. మంత్రివర్గ విస్తరణ సీఎం విచక్షణాధికారం. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటు. తెలంగాణను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారు. పాలనపై సీఎంకు పట్టులేకుండా పోయింది.హెచ్ సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై మజ్లిస్ ను గెలిపించాలనుకుంటన్నయ్. హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయి. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్…దేశభక్తి పార్టీ బీజేపీ. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీకి, దేశభక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఎవరి పక్షాన నిలబడి ఓటేస్తారో…హైదరాబాద్ కార్పొరేటర్లు, ఓటర్లు ఆలోచించాలి. సిద్ధాంతం కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి గౌతంరావు గెలుస్తారనే నమ్మకం ఉంది. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నడో కుమ్కక్కైనయ్. చెన్నయ్ లో డీలిమిటేషన్ మీటింగ్ కు రెండు పార్టీలు కలిసే హాజరైనయ్. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసే ఓటేసినయ్.