హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ రోజు మల్ఖేడ్ రైల్వే స్టేషన్లోని ఎం/ఎస్ అల్ట్రాటెక్ సిమెంట్ సైడింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ అంతటా ఆయనతో పాటు దక్షిణ మధ్య ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీమతి కె. పద్మజ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్తో పాటు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్ నుండి తాండూర్ వరకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జి.పి.ఆర్) అమర్చిన కోచ్లో ప్రయాణించి ట్రాక్ తనిఖీని ప్రారంభించారు. జి.పి.ఆర్ వ్యవస్థ, విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించి ట్రాక్ కిందనున్న పొరలను ఎటువంటి విధ్వంసం కలిగించకుండా (నాన్-డిస్ట్రక్టివ్ పద్ధతిలో) స్కాన్ చేసి తద్వారా ట్రాక్ భద్రతను అంచనా వేస్తుంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ బ్లాక్లు లేదా లైన్ మూసివేత అవసరం లేకుండానే ట్రాక్ భద్రతను సమర్థవంతంగా పరిశీలించే అవకాశం కలుగుతుంది.

అంతేకాకుండా, జనరల్ మేనేజర్ మల్ఖేడ్లోని సిమెంట్ సైడింగ్ను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మౌలిక సదుపాయాలను అంచనా వేసి, సరుకు రవాణా కార్యకలాపాలను సమీక్షించారు. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆయన అధికారులతో తదుపరి అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చించారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అల్ట్రాటెక్ సైడింగ్లోని సెంట్రల్ కంట్రోల్ రూమ్ను తనిఖీ చేసి, రైలు కార్యకలాపాలు మరియు పర్యవేక్షణ వ్యవస్థలను సమీక్షించారు. జనరల్ మేనేజర్ కంట్రోల్ రూమ్లో అత్యాధునిక పరికరాల ప్రత్యక్ష ప్రదర్శనను కూడా వీక్షించారు మరియు కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడాన్ని అభినందించారు.
Also Read-

అలాగే సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సిమెంట్ సైడింగ్లోని ఉత్పత్తి ప్లాంట్ను తనిఖీ చేసి, లోడింగ్ మౌలిక సదుపాయాలు మరియు సరుకు రవాణా సౌకర్యాలను సమీక్షించారు. జనరల్ మేనేజర్ అల్ట్రాటెక్ అధికారులతో ఒక సవివరమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, సరుకు రవాణా కార్యకలాపాలను మరింత మెరుగుపరచడం కోసం భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు మరియు వివిధ వినూత్న సాధనాల వినియోగంపై వారు ఒక సంక్షిప్త ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ తనిఖీ సందర్భంగా, మల్ఖేడ్ స్టేషన్ వద్ద రైలు సేవలను మెరుగుపరచడంపై స్థానిక ప్రజలు మరియు ఇతర భాగస్వాముల నుండి జనరల్ మేనేజర్ విజ్ఞప్తులను స్వీకరించారు.


