హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లును సత్వరమే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎన్ సీ ఆర్ డబ్ల్యూ ఆధ్వర్యంలో శనివారం హిమాయత్ నగర్ లో చేపట్టిన చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభ ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును సాధించాలంటే మహిళల శక్తిని ప్రదర్శించాల్సిందేనని అన్నారు. ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో భారీ సభ నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని పిలుపునిచ్చారు. మహిళా కోటా సాధన కోసం అన్ని మహిళా సంఘాలతో కలిసి తాము పని చేస్తామని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నప్పుడే మహిళలు ఉన్నత స్థానానికి చేరుతారని చెప్పారు. మహిళల కోసం తాను ధైర్యంగా ముందడుగు వేసి పార్టీ పెట్టానని ఈ సందర్భంగా కవిత చెప్పారు.
మహిళ రిజర్వేషన్ల బిల్లును సత్వరమే అమలు చేయాలంటే మహిళలంతా ఒక్కటిగా పోరాడాలని కవిత అన్నారు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఓట్లకే ప్రాధాన్యమిస్తాయని… మహిళ బిల్లు అమలు చేయకపోతే ఓట్లు వేయబోమని మహిళలంతా గట్టిగా చెప్పాలని సూచించారు. అప్పుడు మాత్రమే మహిళ బిల్లును అమలు చేస్తారన్నారు. మహిళ బిల్లుతో పాటు ఓబీసీ మహిళలకు సబ్ కోటా కూడా ఉండాల్సిన అవసరముందని కవిత చెప్పారు. ఇటీవల కాలంలో తనను కలుస్తున్న చాలా మంది మహిళలు మనకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కానీ మహిళలను ఒక స్థాయి వరకు మాత్రమే ఎదగనిస్తారని ఆ తర్వాత అడ్డుకట్ట వేస్తారని కవిత చెప్పారు. ఆ పరిస్థితి లేకుండా ఎదగాలంటే కచ్చితంగా మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరమని అన్నారు.

అదే విధంగా రిజర్వేషన్లు సాధించుకోవటమే కాకుండా అందుకు తగిన విధంగా మహిళ లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరముందని సూచించారు. అందుకోసం స్పెషల్ గా లీడర్ షిప్ ట్రైనింగ్ డ్రైవ్ లు చేపట్టాలన్నారు. బీసీ, మైనార్టీ ల నుంచి మహిళ నాయకత్వం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనార్టీ మహిళ లీడర్లు చాలా తక్కువ ఉన్నారన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా పోస్ట్ డేటేడ్ చెక్కు మాదిరిగా కొర్రీలు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read-
మహిళలకు రాజకీయ ప్రాతినిథ్యం పెరగాలని తాను ధైర్యంగా ముందడుగు వేసి పార్టీ పెట్టానని కవిత చెప్పారు. తమ పార్టీలో 33 శాతానికి తగ్గకుండా మహిళలకు సీట్లు ఇస్తామన్నారు. సరైన నాయకత్వం ఉంటే 50 శాతం సీట్లను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. మహిళలు గర్వంగా చెప్పుకునేలా మంచి రాజకీయాలను చేస్తానని కవిత ఈ సందర్భంగా చెప్పారు. పార్టీల పరంగా 33 శాతం సీట్లు ఇవ్వాలంటూ కొంతమంది కోరుతున్నారని కానీ అలా చేస్తే ఇతర పార్టీల వారంతా కలిసి మహిళలను ఓడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా 33 శాతం సీట్లు ఇచ్చిన పార్టీలు నష్టపోతున్నాయని చెప్పారు. అందుకే రాజ్యాంగ బద్దంగానే మహిళలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. అందుకోసం అందరం పోరాటం చేద్దామని సూచించారు.

ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారులు గొట్టిముక్కల పద్మారావు కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. శనివారం కూకట్ పల్లిలోని వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
