“తలకాయ ఉన్నోడు ఇంటర్మీడియేట్ విద్య తీసేయాలని అనడు, ఇంటర్ విద్య బలంగా ఉంది దాని జోలికి వెళ్లొద్దు”

హైదరాబాద్ : మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవరు కూడా ఇంటర్మీడియేట్ విద్య విధానం తీసేస్తామని అనుకోరని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంటర్ విద్య విధానంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని మీడియా అకాడమీలో శుక్రవారం నిర్వహించిన సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ జంగ్ సైరన్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలోనే మన ఇంటర్ విద్య నంబర్ వన్ గా ఉందన్నారు. అలాంటి ఇంటర్ బోర్డును తీసేయాలనుకోవడం అంటే కొరివితో తలగొక్కునట్టేనని చెప్పారు. ఇంటర్ విద్య విధానం తీసేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తుగ్లక్ కూడా సిగ్గు పడుతడు

ఇంటర్మీడియేట్ విద్యను తీసేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని చూసి తుగ్లక్ కూడా సిగ్గుపడుతాడని అన్నారు. పిచ్చి పనులు చేసే పాలకుడిని తుగ్లక్ అంటుంటారు, ఇక నుంచి రేవంత్ రెడ్డి అనాల్సి వచ్చేలా ఉందని ఎద్దేవా చేశారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు మేధావులు, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ తో మాట్లాడాలని సూచించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే బెడిసి కొడుతుందని అన్నారు. మీటింగ్ లో సడన్ గా నిర్ణయం తీసుకొని ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియేట్ అడ్మిషన్లు ఉండవని సీఎం అంటారని… ఆ తర్వాత రెండు రోజులకే ఇంటర్ బోర్డు అడ్మిషన్ల ప్రక్రియను ప్రకటించిందని గుర్తు చేశారు. అంటే ముఖ్యమంత్రి మాటకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సీఎం పదవికి ఉన్న డిగ్నిటీని కాపాడాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

ముఖ్యమంత్రి మాటలు వింటే భయమవుతుంది

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే భయమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విద్య వేస్ట్, ఐటీఐ, పాలిటెక్నిక్ తీసేస్తామని ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. వైట్ కాలర్ జాబ్ లు వదిలేసి బ్లూ కాలర్ జాబ్ లు వెతుక్కోవాలని సీఎం సూచించటం ఏంటనీ ప్రశ్నించారు. ప్రభుత్వ లక్ష్యం హిమలయాలంత ఉన్నతంగా ఉండాలే తప్ప… పాతాళం మాదిరిగా ఉండొద్దని సూచించారు. ఉద్యోగాలిచ్చే వ్యాపారులను తయారు చేసే లక్ష్యం దిశగా ప్రభుత్వం పని చేయాలన్నారు. మన ఇంటర్మీడియేట్ బోర్డు దేశంలోనే నంబర్ వన్ గా ఉందని చెప్పారు. ఇలాంటి సంస్థను మరింత పటిష్టం చేయాలే తప్ప తీసేయాలనుకోవడం సరికాదన్నారు. ఇంటర్మీడియేట్ విద్య పటిష్టంగా ఉండడంతోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీల్లో ఉన్న ఇంజనీర్లలో తెలుగువాళ్లే ఎక్కువ ఉన్నారని చెప్పారు. ఇంటర్మీడియేట్ విద్య ద్వాకరా ప్రయోజనం పొందిన వ్యక్తుల్లో తాను ఒకరినని కవిత చెప్పారు.

Also Read-

కొరివితో తలగొక్కున్నట్టే

ఇంటర్మీడియేట్ విద్యను తీసేయాలనుకోవడం కొరివితో తలగొక్కునట్లేనని హెచ్చరించారు. ఇప్పుడున్న ఇంటర్ విద్యతో ఎలాంటి సమస్య లేదని దాని జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ ఏడాది మాత్రమే ఇంటర్మీడియేట్ ఉంటుందని వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్య ఉండకపోవచ్చని సీఎం చెబుతున్నారని గుర్తు చేశారు. ఇంటర్ విద్య లేదంటే విద్యార్థుల తల్లితండ్రులే ఈ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని అన్నారు. ఇంటర్ విద్య ను కాపాడుకోవాల్సిన అవసరముందని, ఈ విషయంలో ఇంటర్ విద్య జేఏసీతో కలిసి పనిచేస్తామన్నారు.

పొలిటికల్ విల్ ఉంటే ఉచిత విద్య, వైద్యం సాధ్యమే

విద్యా కమిషన్ పేరుతో ఈ ముఖ్యమంత్రి మూడేళ్లు వృథా చేశారని మండిపడ్డారు. విద్యా కమిషన్ చేసిన సూచనల్లో టెస్టెడ్, ట్రెయిన్డ్, ఫెయిల్డ్ సూచనలున్నాయన్నారు. వాటిని కూడా సీఎం పట్టించుకోలేదని చెప్పారు. అలాంటప్పుడు కమిషన్ పేరుతో ఎందుకు సమయం వృథా చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ కేకే కమిషన్ పేరుతో మరింత సమయం వృథా చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉందని, కేకే కమిషన్ నివేదిక ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దాన్ని అమలు చేస్తారని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్య, వైద్యం అందిచాలన్నది తమ సంకల్పమని చెప్పారు. అందుకోసం బడ్జెట్ సరిపోతుందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారని.. కానీ అది సాధ్యమేనని స్పష్టం చేశారు. ఎన్నో కమిటీల్లో ఉండి ప్రపంచం మొత్తం తిరిగి అధ్యయనం చేసిన వ్యక్తిగా, 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉన్న అనుభవంతో తాను ఈ మాట చెబుతున్నానన్నారు. రాష్ట్రానికి ఏటా వస్తున్న రూ. 2 లక్షల కోట్ల ఆదాయంలో లక్ష కోట్లు విద్య, వైద్యం కోసం కేటాయిస్తే ఇది సాధ్యమేనని చెప్పారు. పొలిటికల్ విల్ ఉంటే ప్రజలకు ఉచిత విద్య, వైద్యం కచ్చితంగా ఇవ్వవచ్చన్నారు.

One thought on ““తలకాయ ఉన్నోడు ఇంటర్మీడియేట్ విద్య తీసేయాలని అనడు, ఇంటర్ విద్య బలంగా ఉంది దాని జోలికి వెళ్లొద్దు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X