వెల్దుర్తి రైల్వే స్టేషన్ నుండి పిగ్ ఐరన్& టీఎంటీ స్టీల్ బార్లతో కూడిన తొలి కంటైనర్ రేక్
జానకం పేట్ రైల్వే స్టేషన్ నుండి 21 వ్యాగన్లలో మొక్కజొన్న లోడింగ్తో తొలి సరుకు రేక్
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా విభాగంలో నూతన సరుకులను లోడింగ్ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సరుకు రవాణాను మరింత పెంపొందించడంతో పాటు, కొత్త రవాణా మార్గాలను జోడించడం వంటి తన ప్రయత్నాలలో భాగంగా, ఈ జోన్లోని హైదరాబాద్ డివిజన్ వెల్దుర్తి మరియు జానకం పేట్ స్టేషన్ల నుండి సరుకు రవాణాను ప్రారంభించింది. ఈ చొరవ వలన డివిజన్ సరుకు రవాణా వ్యాపారాన్ని బలోపేతం చేయడంతో పాటు, రైలు నెట్వర్క్ ద్వారా పారిశ్రామిక మరియు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కొత్త మార్గాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

Also Read-
వెల్దుర్తి రైల్వే స్టేషన్లో తొలిసారిగా ప్రత్యేక కంటైనర్ టెర్మినల్ను ఏర్పాటు చేయగా, సమీపంలోని ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్న పిగ్ ఐరన్ మరియు టీఎంటీ స్టీల్ బార్లతో తొలి రేక్ లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. లోడ్ చేసిన ఈ రేకులను ఢిల్లీ, పంజాబ్, ముంబై, గుజరాత్ తదితర ప్రధాన గమ్యస్థానాలకు రవాణా చేయనున్నట్లు ప్రణాళిక రూపొందించబడింది. వెల్దుర్తి ప్రత్యేక కంటైనర్ టెర్మినల్ ద్వారా ఇనుము, ఉక్కు ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లకు మరింత సమర్థవంతంగా, విశ్వసనీయంగా, వ్యయ ప్రయోజనాలతో కూడిన రవాణా సౌకర్యాన్ని పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టెర్మినల్ ఏర్పాటుతో పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు, సరుకు రవాణా వ్యాపారానికి మరింత ఊతం లభించనుంది.

అంతేకాకుండా, జానకం పేట్ స్టేషన్ సరుకు రవాణా కోసం ప్రారంభించగా 21 కవర్డ్ వ్యాగన్లతో కూడిన మొదటి ‘మినీ రేక్’లో మొక్కజొన్నను లోడ్ చేశారు. ఈ రేక్ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్కు తరలించబడుతోంది. ఈ చొరవ తెలంగాణ నుండి మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి మొక్కజొన్న రవాణాను సులభతరం చేస్తుంది; ముఖ్యంగా రైతులు తమ పంటను రైలు మార్గం ద్వారా తక్కువ ఖర్చుతో మరియు నమ్మదగిన రీతిలో రవాణా చేసుకోవడానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, మరాఠ్వాడా ప్రాంతంలోని ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడంలోనూ సహాయపడుతుంది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు, నూతన ట్రాఫిక్ను జోడించడంలో మరియు జోన్ యొక్క సరుకు రవాణా విభాగాన్ని మెరుగుపరచడంలో హైదరాబాద్ డివిజన్ చేసిన కృషిని అభినందించారు. జోన్ విభజన తర్వాత కూడా దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా లోడింగ్ను మరింత బలోపేతం చేయడానికి ఇదే వేగాన్ని కొనసాగించాలని ఆయన హైదరాబాద్ డివిజన్ కు సూచించారు.
