పన్నెండేళ్ల ప్రసంగాల నుండి ఎంపిక చేసిన ప్రామాణిక వ్యాఖ్యలతో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు రూపొందించిన త్రిభాషా గ్రంథం
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా వెలువరించిన ‘మోదీ వాణి — సేవ • సంకల్పం • వికసిత భారత్’ త్రిభాషా గ్రంథాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సంయుక్తంగా ఆవిష్కరించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రాజకీయ–సామాజిక విశ్లేషకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఈ గ్రంథాన్ని రూపొందించారు.
Also Read-
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పన్నెండేళ్ల పాలనా కాలంలో దేశంలో, విదేశాల్లో చేసిన ప్రసంగాలను విస్తృతంగా పరిశీలించి, ప్రజల్లో విశేష గుర్తింపు పొందిన ముఖ్యమైన వ్యాఖ్యలు, వాక్యాలు, కొటేషన్లను ఈ గ్రంథంలో పొందుపరిచారు. మోదీ ఆలోచనలు, పాలనా దృక్పథం, జాతీయ దర్శనాన్ని సమగ్రంగా పరిచయం చేసే ఈ గ్రంథాన్ని ఆయన 76వ జన్మదినానికి ప్రత్యేక కానుకగా వెలువరించారు.

‘మోదీ వాణి’ ప్రత్యేకతలు
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల్లోని ఎంపిక చేసిన ప్రామాణిక కొటేషన్లతో రూపొందిన త్రిభాషా సంకలనం.
- ప్రతి కొటేషన్ను ముందుగా మోదీ వ్యాఖ్యానించిన అసలు హిందీ భాషలో ఇచ్చి, ఆ తరువాత సహజమైన తెలుగు, ఇంగ్లీష్ రూపాలను పొందుపరిచారు.
- ప్రధానమంత్రి అధికారిక ప్రసంగాలు, విశ్వసనీయమైన ప్రామాణిక ఆధారాలను విస్తృతంగా పరిశీలించి కొటేషన్లను ఎంపిక చేశారు.
- ప్రతి వ్యాఖ్యకు సంబంధించిన సందర్భం, ప్రసంగ నేపథ్యం, మూల వివరాలను స్పష్టంగా అందించారు.
- సేవ, సంకల్పం, సుపరిపాలన, అంత్యోదయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, యువశక్తి, రైతు సంక్షేమం, ఆత్మనిర్భర్ భారత్, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వేదికపై భారతదేశ నాయకత్వం వంటి విస్తృత అంశాలకు ఇందులో స్థానం కల్పించారు.
- మోదీ జీ సందేశాలు, పాలనా తత్వం, దేశ భవిష్యత్తుపై ఆయన దార్శనికతను మూడు భాషల పాఠకులకు చేరువ చేసే వినూత్న ఆలోచనకు ఈ గ్రంథం రూపం ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతకుమార్, శ్రీమతి జయశ్రీ, కల్యాణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, డాక్టర్ వేముల అశోక్, టి. వీరేందర్ గౌడ్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, సీనియర్ నాయకులు శ్రీని రెడ్డి, గోపాల్ జీ, సుభాష్ చంద్ర జీ, శ్రీమతి రాణి రుద్రమ, శ్రీమతి పద్మ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు
