ఎన్ రామచంద్ర రావు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించి, స్మరించుకున్నారు ఆయన సేవలను

హైదరాబాద్ : భారతీయ జనసంఘ్ స్థాపకులు, మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా హైదరాబాద్‌లోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై, డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన దేశానికి చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు.

అనంతరం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ… డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగానికి, ధైర్యానికి మరియు రాజీలేని నిబద్ధతకు ఒక నిదర్శనమని కొనియాడారు. 1950ల నాటి కాశ్మీర్, హైదరాబాద్ పరిస్థితులను పోలుస్తూ నాడు అద్వానీ సూచన మేరకు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయ భవనానికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాటి రోజుల్లో హైదరాబాద్ నిజాం పాలనలో ఉండగా, జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంతో పూర్తి విలీనం అయ్యే విషయంలో సవాళ్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. హైదరాబాద్ మరియు ఇతర సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎలాగైతే నిర్ణయాత్మక పాత్ర పోషించారో, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తి స్థాయిలో అంతర్భాగం చేయడం కోసం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలనే త్యాగం చేశారని స్పష్టం చేశారు.

ఈ రోజు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందంటే, దానికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పోషించిన దృఢమైన, చారిత్రాత్మక పాత్రే కారణమని రాంచందర్ రావు తెలిపారు. హిందువుల రక్షణ కోసం ఆయన నిర్భయంగా పోరాడారని, విభజన మరియు ఓటు బ్యాంకు తుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారని చెప్పారు. డాక్టర్ ముఖర్జీ గొప్ప మేధావి, పరిపాలకుడని, కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారని గుర్తుచేశారు. ఎన్నో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగత అధికారం లేదా పదవుల కంటే ఆయన ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.

Also Read-

జాతీయ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న తుష్టీకరణ, రాజీ ధోరణిని అంగీకరించలేక డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నెహ్రూ క్యాబినెట్ నుండి రాజీనామా చేశారని రాంచందర్ రావు గుర్తుచేశారు. ఆయన జీవితం బిజెపి కార్యకర్తలకు “దేశమే మొదటిది” (నేషన్ ఫస్ట్) అనే మార్గదర్శక మంత్రాన్ని అందించిందని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీ పార్టీలు బెంగాల్‌ను నిజమైన అభివృద్ధికి దూరం చేశాయని, అయితే నేడు బిజెపి నాయకత్వంలో బెంగాల్‌లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను పునరుద్ధరించడం జరుగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణలోని ప్రతి బిజెపి కార్యకర్త బెంగాల్‌లోని బిజెపి విజయాల నుండి స్ఫూర్తి పొంది, దానిని తెలంగాణలోనూ పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు. బెంగాల్‌లోని బిజెపి కార్యకర్తలు ఎలాగైతే పట్టుదలతో పోరాడుతున్నారో, అదే స్ఫూర్తితో తెలంగాణ బిజెపి కార్యకర్తలు కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X