హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ తన సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకొని క్రమపద్ధతిలో అమలు చేయడం ద్వారా, ఒక సమగ్ర డిజిటల్ విద్యా సంస్థగా పరిణామం చెందడానికి ముందడుగు వేస్తోందని వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అభిప్రాయపడ్డారు. “విద్యా వారోత్సవాల్లో” భాగంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సమగ్ర అధ్యయనం తర్వాత రూపొందించుకున్న “ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ” (ఐ.డి.పి.) ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అత్యున్నత స్థాయి గుర్తింపును సాధించడానికి దోహదపడటంతో పాటు, భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయం ప్రస్తుతం తన కార్యకలాపాల ఐదవ దశాబ్దంలో ఉందని, ఈ కాలాన్ని “పరివర్తన దశాబ్దం”గా పేర్కొనడం సముచితంగా ఉంటుందని, ఇందులో భాగంగా సాంప్రదాయ విద్యా కార్యక్రమాలతో పాటు ఉపాధి ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.

కార్యాచరణ చట్రాన్ని వివరిస్తూ, విశ్వవిద్యాలయం ఈ అన్ని కార్యక్రమాలలో అభ్యాసకుడిని కేంద్ర బిందువుగా పనిచేస్తూ సంస్థ ప్రతి విభాగంలో నాణ్యమైన సేవలు అందించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విశ్వవిద్యాలయ నిర్దిష్ట కార్యాచరణ నిర్మాణంలో ఐదు కీలకమైన విభాగాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అకడమిక్ వ్యవహారాలు, విద్యార్థి, సేవలు, పరిపాలనా సేవలు, సాంకేతిక సేవలు, స్కిల్ డెవలప్మెంట్ అని వివరించారు. వీటి అన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు.
Also Read-

అనంతరం, ప్రొ. చక్రపాణి ఇతర డిరెక్టర్లు, డీన్ లతో కలిసి “సంస్థాగత అభివృద్ధి సమగ్ర ప్రణాలిక (2026 – 2036)” ను “విద్యా వారోత్సవాల” లో భాగంగా విడుదల చేశారు. అదేవిధంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ “నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) గుర్తింపు కోసం ఆన్లైన్ అప్లికేషన్ ను దిగ్విజయంగా సమర్పించింది.

ఈ కార్యక్రమానికి అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్. విజయా కృష్ణా రెడ్డి, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవి కాబ్డే; ప్రొ. పి. వెంకటరమణ, ప్రొ. ఎన్. రజని, ప్రొ. కె. శ్రీదేవి, డా. వై. వెంకటేశ్వర్లు; బోధనేతర సంఘం అధ్యక్షులు కాంతం ప్రేమ్ కుమార్ అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

