చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంది.
సత్యం, సదాచార మార్గంలో కర్తవ్యనిష్టతో ముందుకెళ్లడం ద్వారా ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కుని విజయం సాధిస్తామనేది విజయదశమి మనకందించే సందేశం. మనలోని చెడును ఆలోచనలను దహించివేస్తూ సత్ప్రవర్తనతో ముందుకెళ్లాలని దసరా సందర్భంగా చేసే రావణ దహనం వెనకున్న నిగూఢార్థం.
రామాయణ మూలసూత్రాలను, అందులో దాగున్న విలువలను సమాజానికి బోధించే దసరా పండగ.. ప్రపంచం, సమాజం, కుటుంబం వంటి విషయాలపై మన కర్తవ్యాన్ని, మనుషుల మధ్య పరస్పర సంబంధాలు, మర్యాదలను గుర్తుచేస్తుంది. నేటి సమాజానికి రామాయణం, రాముడు పాటించిన విలువలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది.
దీనికితోడు దసరా పండగ ప్రపంచానికి స్రీ శక్తిని చాటుతుంది. మహిళలు దుర్గాదేవి అవతారం, వారిని గౌరవించుకోవడంతోపాటు సమాజంలో వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన స్ఫూర్తిని చాటే దసరా పండగ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ పండగ మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
మీ
కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..
తెలంగాణ ప్రజలకు దసరా (విజయదశమి) పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరువుకునే పండుగ దసరా అని, విజయానికి సంకేతంగా భావించే దసరా పండుగను ప్రజల సంతోశంగా, ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
దసరా పండుగ సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై విజయానికి చిహ్నంగా దసరా పండుగను జరుపుకుంటారని అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనం అని వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్కరికి చేసే పనులలో విజయం సిద్ధించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.
కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు.
దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానమున్నదని అన్నారు.
అలాయ్ బలాయి తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా దసరా పండుగ సందర్భంగా ప్రజల నడుమ సామాజిక సామరస్యం ఫరిడ విల్లుతుందని కేసీఆర్ అన్నారు. ప్రజలు తాము నిర్వర్తించే వృత్తులకు సంబంధించిన ఉత్పత్తి పరికరాలను, వినియోగించే వాహనాలను ఆయుధ పూజ చేసి గౌరవించుకునే…
ఎంపీ వద్దిరాజు తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర దసరా (విజయదశమి) సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దసరా సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడిపి పాలపిట్టను దర్శించుకుని,జమ్మి చెట్టుకు తమ కోరికలను నివేదించి, దాని ఆకులను బంగారంలా పెద్దలకు అందించి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
దసరా పండుగ తెలంగాణ ప్రజలకు అతి ముఖ్యమైనదని,ప్రత్యేకత కలిగి ఉందని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా తాము ఎంచుకున్న రంగాలలో రాష్ట్ర ప్రజలందరికి విజయాలు చేకూరాలని,సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన అభిలషించారు. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ విదేశాలలో నివసిస్తున్న, స్థిరపడిన తెలంగాణ బిడ్డలందరికి ఎంపీ వద్దిరాజు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగను శాంతియుతంగా, ప్రశాంతంగా, ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవలసిందిగా ఎంపీ రవిచంద్ర ప్రజలను కోరారు.