వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం : బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్

ఇప్పటికే నష్టాల్లో ఉన్న సివిల్ సప్లై కార్పొరేషన్ ను మరింత పాతాళంలోకి తొక్కే కుట్ర దాదాపు రూ. 750 కోట్లకు పైగా స్వాహా చేసే ప్రయత్నం
సీబీఐ విచారణకు డిమాండ్

హైదరాబాద్ : వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పిలిచిన దాదాపు 35 లక్షల టన్నుల వడ్ల టెండర్ లో పారదర్శకత లోపించిందని, ఇందులో దాదాపు రూ. 750 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియ నిర్వహించిన విధానమే ఈ అనుమానాలకు కారణమని ఆయన తెలిపారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్నవారికి వేలకోట్ల రూపాయల సామర్థ్యం ఉండాలని కండిషన్లు పెట్టి.. తమ అనుయాయులకు మాత్రమే అవకాశం దక్కేలా చేశారని ఆయన దుయ్యబట్టారు. ఎక్కువమంది బిడ్డింగ్ లో పాల్గొంటే వాళ్ల అక్రమాలకు అవకాశముండదని, కండిషన్లు పెట్టి చాలామంది మిల్లర్లు బిడ్డింగ్ లో పాల్గొనకుండా చేశారని శంకర్ అన్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, విఠల్, బిజెపి సీనియర్ నాయకుడు మురళీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించాల్సిన వడ్ల కొనుగోలు టెండర్లను తక్కువధరకే బిడ్డర్లకు అప్పగించి, వేల కోట్ల రూపాయల అక్రమాలకు, అవతవకలకు కారణమైందని పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

90 రోజుల్లోగా 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను రూ. 7,250 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చెల్లించి, మిల్లర్ల దగ్గరి నుంచి తీసుకెళ్తామన్న బిడ్డర్లపై ఈరోజు ఇచ్చిన గడువు దాటిపోయినా, ప్రభుత్వం బిడ్డర్లకు కనీస ఫెనాల్టీ ఎందుకు వేయలేకపోయిందని పాయల్ శంకర్ ప్రశ్నించారు. అలాగే కట్టినటువంటి డిపాజిట్ ను ప్రభుత్వం ఎందుకు జప్తు చేయడం లేదని ప్రశ్నించారు. మిల్లర్లంతా ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టి వడ్లు కొనుగోలు చేసిందో అంత వాళ్ల దగ్గరున్న స్టాక్ కు డబ్బు చెల్లిస్తామన్న కూడా ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వలేదని శంకర్ వెల్లడించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు టెండర్ పెడితే బిడ్డర్లు 90 రోజుల లోపల రూ. 7,245 కోట్లు బిడ్డర్లు ప్రభుత్వంకు చెల్లించి, వడ్లను తీసుకెళ్లాల్సి ఉండగా… కాని అలా జరగకుండా మిల్లర్ల దగ్గర నుంచి బిడ్డర్లు నేరుగా రూ. 2,230 డబ్బు చెల్లించమని బిడ్డర్లు మిల్లర్లపై ఒత్తిడి చేసి, కొందరు మిల్లర్ల దగ్గర ఇప్పటికే డబ్బులు వసూలు చేశారంటూ మండిపడ్డారు. అంటే.. క్వింటాలుకు రూ. 227 చొప్పున టన్నుకు రూ. 2,270 బిడ్డర్ మిల్లర్ దగ్గర నుంచి అదనంగా వసూలు చేసినట్లు సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ అదనంగా వసూలు చేసిన ఈ డబ్బు ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నించారు.

Also Read-

2024-25 ఖరీఫ్ లో దాదాపు 75 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని, అందుకే గోదాంలను ఖాళీ చేసేందుకే టెండర్ల ద్వారా వడ్లు అమ్మినట్లు చెబుతున్న ప్రభుత్వం మాటల్లో చిత్తశుద్ధి లేదని పాయల్ శంకర్ అన్నారు. బిడ్డర్లు దక్కించుకున్నన వ్యక్తులు ఇప్పటివరకు కనీసం 10 లక్షల టన్నుల ధాన్యం కూడా లిఫ్టు చేయలేదని, 2023-24 ఖరీఫ్ లో కొన్నటువంటి 30 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్, 2023-24 రబీ లో కొన్నటువంటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలతో గోదాంలు నిండుగా ఉన్నాయని చెప్పారు. మరి, త్వరలో రాబోయే 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తారని ఆయన నిలదీశారు. ఒకవేళ బిడ్డర్లు వెంటనే మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రాబోయే పంట మళ్లీ రోడ్డుపాలు అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గత సీజన్ లో వర్షానికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిచి రైతులు తీవ్రంగా నష్టపోయారని పాయల్ శంకర్ గుర్తు చేశారు.

అంతేకాకుండా క్వింటాలుకు 2007 రూపాయల చొప్పున కొన్న బిడ్డరు.. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ తో కలిపి ధర పెరగనుండటంతో ఈ వడ్లనే రీసైక్లింగ్ చేసే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే అది మరో పెద్ద కుంభకోణానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే వేలకోట్ల నష్టాల్లో ఉన్న సివిల్ సప్లై కార్పొరేషన్ దాదాపు 55 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన గుర్తుచేశారు. పారదర్శకత లేని ప్రభుత్వ నిర్ణయాలతో సివిల్ సప్లై కార్పొరేషన్ పూర్తిగా అధ:పాతాళానికి పోవడం ఖాయమని శంకర్ పేర్కొన్నారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉన్న అప్పులు, నష్టాలపై కార్పొరేషన్ అప్పుల్లో కూరుకుపోయి, నష్టాలు చవిచూసిందని బిజెపి ప్రభుత్వానికి స్పష్టంగా వివరించినప్పటికీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ పంథానే అవలంభించడం బాధాకరమని పాయల్ శంకర్ గుర్తుచేశారు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పారదర్శకత విధానాన్ని అధ్యయనం చేయమని, అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా అవలంభించాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా అప్పుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ నష్టాల్లో ఉన్న కార్పొరేషన్ ను గట్టెక్కించగలిగే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బిజెపి సూచనలను పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారకపోతే రాబోవు రోజుల్లో మరింత నష్టాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. మరో నెలరోజుల్లో ఖరీఫ్ పంట చేతికొచ్చే అవకాశం ఉండటంతో గోదాములను ఖాళీ చేయాల్సి ఉందని సూచించారు.

అంతేకాకుండా, కోట్లాది రూపాయల విలువైన వడ్లు సంబంధిత మిల్లర్లకు ఇచ్చినప్పుడు ఎటువంటి పూచికత్తు, బ్యాంకు గ్యారంటీ లేకుండా ప్రభుత్వ సొమ్ముతో కొన్న వడ్లను మిల్లర్లకు దారాధత్తం చేస్తున్నదంటూ ప్రభుత్వ తీరుపై శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 3 కోట్ల విలువ గల మిల్లర్ కు రూ. 30 కోట్ల విలువ కలిగిన వడ్లను ఇచ్చినప్పుడు సంబంధిత మిల్లర్ తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇయ్యనప్పుడు దానికి బాధ్యత ఎవరిదంటూ శంకర్ నిలదీశారు. లక్ష రూపాయల టెండర్ పెడితే సవాలక్ష కండిషన్లు పెట్టే ప్రభుత్వం వేలకోట్ల రూపాయల వడ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నపుడు ఎటువంటి గ్యారంటీ లేకుండా ఆ వడ్లను కట్టబెట్టడం ప్రభుత్వ అసమర్థతేనని దుయ్యబట్టారు.

ధాన్యం కొనుగోలు టెండర్లలో పాల్గొన్న బిడ్డర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7,250 కోట్లు చెల్లించి, ధాన్యం తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఇంతటి భారం పడేది కాదంటూ హితవు పలికారు. దీని కారణంగా నేడు ప్రభుత్వం రూ. 54 వేల కోట్లకు గాను సంవత్సరానికి రూ. 3 వేల నుంచి 4 వేల కోట్ల దాకా వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో కొందరు బినామీలమీద, గుమాస్తాల మీద, లీజు మిల్లుల పేరుమీద లైసెన్సులు పొంది, తద్వారా కోట్ల రూపాయల వడ్లు తీసుకొని, ప్రభుత్వానికి ఎగ్గొట్టే ప్రయత్నం చేసినా, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్ల ఆస్తుల విలువలు కేవలం లక్షల్లో ఉన్నప్పటికీ.. కోట్లాది రూపాయల సొమ్మును వారి నుంచి ఎలా రికవరీ చేస్తుందని శంకర్ నిలదీశారు.

రాష్ట్రంలో వడ్ల కొనుగోలు టెండర్లలో జరిగినటువంటి అవకతవకలపై న్యాయనిపుణులతో లోతుగా చర్చించి, పార్టీ అనుమతితో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని శంకర్ తెలిపారు. ఈ భారీ కుంభకోణంపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేయడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందని శంకర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X