హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆగస్టు 10 నుండి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక మహోద్యమంలా, పండుగలా జరుపుకుంటున్నామని బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు, తిరంగా యాత్ర రాష్ట్ర కార్యనిర్వాహక కన్వీనర్ డా. మేకల శిల్పారెడ్డి తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 79 ఏళ్ల స్వాతంత్య్రాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
హర్ ఘర్ తిరంగా అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని నింపే ఒక గొప్ప ఉద్యమమని ఆమె స్పష్టం చేశారు. జాతీయ జెండా కేవలం ఆగస్టు 15, జనవరి 26 తేదీలకే పరిమితం కాకుండా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా, మన సమైక్యతకు చిహ్నంగా మారాలన్నదే ప్రధాని మోదీ గారి ఆశయమని పేర్కొన్నారు. ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా… ఘర్ ఘర్ తిరంగా… హర్ మన్ తిరంగా’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
మనకు వచ్చిన స్వాతంత్ర్యం ఎంతో మంది అమరవీరుల త్యాగాలు, బలిదానాల ఫలితమని, ఈ రోజు మన జాతీయ జెండా స్వేచ్ఛగా ఎగురుతోందంటే వారి కృషే కారణమని డా. మేకల శిల్పారెడ్డి గుర్తుచేశారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో తిరంగా యాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ యాత్రల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల, అమరుల కుటుంబాలను నేరుగా కలిసి ‘మేమున్నాం’ అనే భరోసాను బిజెపి కార్యకర్తలు అందిస్తున్నారని తెలిపారు.
Also Read-
ఈ క్రమంలోనే రేపు (ఆగస్టు 14న) ట్యాంక్ బండ్ వద్ద పెద్దఎత్తున ‘తిరంగా ర్యాలీ’ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగబద్ధమైన సమానత్వానికి ప్రతీక అయిన తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం నుండి యువశక్తికి స్ఫూర్తిప్రదాత అయిన స్వామి వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీకి ముందు బిజెపి ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్.రాంచందర్ రావు గారు, కేంద్ర మంత్రులతో కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీ వద్దకు చేరుకుంటారని వివరించారు.
ఈ భారీ తిరంగా ర్యాలీకి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సబ్యుడు డా. కె. లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. వీరితో పాటు మాజీ సైనిక ఉద్యోగులు (ఎక్స్-సర్వీస్మెన్), క్రీడాకారులు, పద్మ అవార్డు గ్రహీతలు, సినీ ప్రముఖులు, వివిధ సామాజిక మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు.
కులాలు, ప్రాంతాలకు అతీతంగా మనందరినీ కలిపే ఏకైక సూత్రం ‘మన తిరంగా’ అని, దేశభక్తి స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ భారీ ర్యాలీకి బిజెపి కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డా. మేకల శిల్పారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి విస్తృత కవరేజ్ అందించి విజయవంతం చేయాల్సిందిగా మీడియా ప్రతినిధులను కోరారు.
