ముఖ్య అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు (పాలక మండలి) ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మరియు అటవీ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ సమక్షంలో, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై నూతన బోర్డు సభ్యులను అభినందించారు.

ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమితులైన మన్నె సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు నామినేటెడ్ సభ్యులుగా నియమితులైన- కొణిదెల సురేష్, వినోద్ వెంకటస్వామి, చిలప్పుగారి విజయరాజం, విజయేందర్ తుల్ల, శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, శ్రీమతి స్వాతి కంతమనేని, ఎం. రాఘవేంద్ర రావు, డి. లక్ష్మినారాయణ నాయక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read-
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. యాదద్రి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు, సేవలందించేందుకు నూతన పాలక మండలి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్సవంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి (EO), ఆలయ ప్రధాన అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.
