హైదరాబాద్ : ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
సినీ నటుడిగా, దర్శకుడిగా తనదైన శైలితో దక్షిణ భారత సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన అందించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలు, సినీ రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.
భాగ్యరాజ్ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇది కూడ చదవండి-
అలాగే, తమిళ సినీ ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నటుడిగా సుమారు 75కు పైగా చిత్రాల్లో నటించారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తనదైన కథన శైలి, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆయన తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు కూడా రచన, దర్శకత్వం వహించారు. 1983లో విడుదలైన ముంధనై ముడిచ్చు చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.
భాగ్యరాజ్ తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, వెల్లన్ కోయిల్ గ్రామంలో 1953 జనవరి 7వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు-కృష్ణస్వామి, అమరావతి అమ్మాళ్. 1981లో ప్రవీణను వివాహం చేసుకున్నారు. 1983లో అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. 1984లో నటి పూర్ణిమ భాగ్యరాజ్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ నటీమణులే. వారికి శరణ్య భాగ్యరాజ్ అనే కుమార్తె, శంతను భాగ్యరాజ్ కుమారుడు ఉన్నారు. శరణ్య పారిజాతం అనే సినిమాతో, శంతను సక్కరకట్టి అనే సినిమాతో సినీరంగంలో ప్రవేశించారు.
