హైదరాబాద్ : జాతీయ మదింపు మరియు గుర్తింపు మండలి (న్యాక్), డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో యూనివర్సిటీ క్యాంపస్లో రెండు రోజుల పాటు “ఆన్లైన్ విద్య – నాణ్యత ” పై నిర్వహించిన సంప్రదింపుల కార్యశాల గురువారం విజయవంతంగా ముగిసింది. ఆన్లైన్ విద్యలో నాణ్యత హామీ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ఉన్న నిపుణులు, నిర్వాహకులు, విద్యావేత్తలు హాజరై ఈ అంశంపై చర్చించారు.

పాఠ్యప్రణాళిక రూపకల్పన, అభివృద్ధి, డిజిటల్ కంటెంట్ రూపొందించడం, బోధన-అభ్యసన ప్రక్రియలు, విద్యార్థి సహాయ సేవలు, మదింపు పద్ధతులు, అధ్యాపకుల అభివృద్ధి, సాంకేతిక వేదికలు, నిరంతర అభివృద్ధి వ్యూహాలు, నాయకత్వం, ఉన్నత విద్యలో అభివృద్ధి చెందుతున్న నియంత్రణలు తదితర అంశాలపై సుదీర్గంగా చర్చించారు.
కౌన్సిల్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (CHE) దక్షిణాఫ్రికా, మాజీ డైరెక్టర్ డా. బ్రిట్టా జవాడా హాజరై అభ్యసన రూపకల్పనను మదింపు పద్ధతుల గురించి సమగ్రంగా వివరించారు. ఆయా పద్ధతులను మదింపునకు అనుసంధానించాలని, విద్యార్థులలో విద్యాపరమైన సమగ్రతను బలోపేతం చేయాలని ఆమె సూచించారు. సహచర మూల్యాంకనం, పరిశ్రమల భాగస్వామ్యం, నైపుణ్య ఆధారిత మూల్యాంకనం వంటి విభిన్న మూల్యాంకన పద్ధతులతో పాటు, సకాలంలో, ఆచరణీయమైన ఫీడ్బ్యాక్ యంత్రాంగాల ఆవశ్యకత గురించి ఉదాహరణలతో డా. బ్రిట్టా జవాడా వివరించారు.

ఆన్లైన్ విద్యా వ్యవస్థలలో సంస్థాగత మూల్యాంకనం, అక్రిడిటేషన్ కోసం ప్రాథమిక అంశాలు, పరిమితులను వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతినిధులు సమగ్రంగా చర్చించారు. దేశంలోని పలు విద్యా సంస్థల్లో ఆన్లైన్ విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యా వేత్తలు 60 మంది పాల్గొని ఉన్నత విద్య నాణ్యతను మెరుగుపరచడానికి అవసరమైన ఉత్తమ పద్ధతులు, సవాళ్లు, వినూత్న విధానాల గురించి విపులంగా చర్చించారు.
Also Read-

ఈ కార్యక్ర్మమలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఇగ్నో వైస్-ఛాన్సలర్ ప్రొ. ఉమా కంజిలాల్, న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేసన్ కన్నభిరాన్, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ – కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా డైరెక్టర్ డా. బషీర్ అహమ్మద్ షడ్రాక్, న్యాక్ సలహాదారు డా. బి. ఎస్. పొన్ముదిరాజ్, పరిశోధక విద్యార్థిని ఇంగ్రిడ్ ఎస్తా మరైస్ (దక్షిణాఫ్రిక), డైరెక్టర్ (అకడమిక్) ప్రొ. జి.పుష్పా చక్రపాణి, సికా డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ హాజరయ్యారు.
