హైదరాబాద్ : పోలీసుల నిర్బంధంలో ఉన్న 600 మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విడిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం చలో సెక్రటేరియట్ కు బయల్దేరారు. పోలీసులు వారిని అడ్డుకొని మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఉద్యమకారులను అరెస్ట్ చేసిన సమాచారం అందుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మధ్యాహ్నం హుటాహుటిన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఠాణాలో పోలీసుల నిర్బంధంలో ఉన్న ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచే ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులతో ఫోన్ లో మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారందరినీ విడిచిపెట్టే వరకు తాను పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని అక్కడే బైఠాయించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి అరెస్ట్ చేసిన ఉద్యమకారులందరినీ విడిపించారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి ఉద్యమకారులను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు.

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ లీడర్లు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఆ పార్టీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. వారికి ఇస్తామనన్న భూమి, పెన్షన్ సహా ఇతర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఇంకా ఉద్యమకారులు తమ డిమాండ్ల సాధన కోసం చలో సెక్రటేరియట్ కు వెళ్లడం, పోలీసులు వారిని అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితి రావడం దురదృష్టమన్నారు. రాష్ట్ర సాధనలో ముందున్న ఉద్యమకారులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో సరైన గౌరవం దక్కలేదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Also Read-
అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కవిత గుర్తు చేశారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లతో పాటు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో ఉద్యమకారుల కోసం బిల్లు పెడతామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఉద్యమకారులకు వారి హక్కులను సాధించుకోవటం పెద్ద కష్టం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే భూ పోరాటాలు చేసి భూమి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో భూ పోరాటాలు ప్రారంభించిందని.. మున్ముందు ఉద్యమకారులతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
