సిఐటియు డిమాండ్
హైదరాబాద్ (సి. మల్లేష్) : ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వేలను అతని అంబానీ వంటి స్వదేశీ, విదేశీ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని, ప్రయాణికుల భద్రతకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానంలో భాగంగా భారతీయ రైల్వే లను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నదని విమర్శించారు. రైల్వేల ప్రవేటికరణ వలన సామాన్య ప్రజానీకానికి అతి చవకైన రవాణా సౌకర్యం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైల్వే యాజమాన్యం ప్యాసింజర్ రైళ్లని తగ్గించిందని, ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను తగ్గించి పేద సామాన్య, ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
వందే భారత్ ట్రైన్ లను ప్రవేశపెట్టి టికెట్ల ధరలు అధికంగా పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజలకు వాటిని దూరం చేసిందని అన్నారు. రైల్వేలలో ప్రయాణిస్తున్న ప్రజల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ మధ్యకాలంలో అనేక యాక్సిడెంట్లు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, ఉద్యోగస్తులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేలలో రక్షణ కొరకు అధునాతనమైన టెక్నాలజీ రక్షక్, కవచ్ వంటివి వాడతామని ప్రభుత్వం చాలాసార్లు వాగ్దానం చేసిందని, కానీ వాటికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు.
Also Read-
రైల్వేలో దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వారికి చట్టపరమైన హక్కులు ఏవి కల్పించకుండా రైల్వే యాజమాన్యం, కాంట్రాక్టర్లు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. కనీస వేతనాలు చెల్లించడంలో ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, పేస్లిప్పులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. హైదరాబాదు రైల్వేస్టేషన్లో గతంలో 150 మంది పని చేయగా నేడు కేవలం 27 మందితో పని చేయించుకుంటూ పని భారం పెంచారని అన్నారు.
కావున కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైల్వేల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, ప్రయాణికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే కాలంలో రైల్వేల రక్షణ కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మే 20న జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెలో రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు,
ఈ కార్యక్రమంలో సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, రైల్వే సీనియర్ నాయకులు శివకుమార్, ఎల్లయ్య, సిఐటియు నాంపల్లి జోన్ కన్వీనర్ సి.మల్లేష్ నాయకులు హర్షద్ అహ్మద్, ఎం.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
