“రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడం పట్ల శ్రద్ధ పెట్టండి”

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడం పట్ల శ్రద్ధ పెట్టండి.

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Also Read-

  • కాళేశ్వరం ప్రాజెక్టు పై జాతీయ డ్యాం సేఫ్టీ  అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  దిల్లీలో పత్రికా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలారు. తన అవగాహనా రాహిత్యాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నారు. 
  • ఒకవైపు మేడిగడ్డ  పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అని అంటూనే  మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు అని అంటున్నాడు. ఈ ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన NDSA, వర్షాకాలం వరదలు రాకముందే.. జులై మొదటి వారం లోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొన్నది. NDSA సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్ట్ లు ఆపివేసినట్టు ఉత్తమ్ పేర్కొనడం గమనార్హం. ఈ వైఫల్యానికి NDSA నిర్లక్ష్య  వైఖరి కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలి. 
  • నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరలో హడావుడిగా వండి వార్చిన రాజకీయ నివేదికపై ఆనాడే విమర్శలు వెల్లువెత్తినాయి. ఎటువంటి పరిశీలన జరపకుండానే, ఎటువంటి భూభౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజనీర్లతో ఏమీ చర్చకుండానే ఇటువంటి నిర్ధారణలకు రావడం కేంద్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే ఒక సాంకేతిక సంస్థ చేయవలసిన పని కాదు. 
  • ప్లానింగ్ లోపాలు ఉండవచ్చునని, డిజైన్ లో లోపాలు ఉండవచ్చునని, నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉండవచ్చునని, నిర్వాహణ లోపాలు ఉండవచ్చునని ఊహాగానాలతో కేంద్రంలోని పాలక పక్షానికి ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి నివేదికను వండి వార్చినట్టు విమర్శలు వెల్లువెత్తినాయి. ఇవన్నీరాసి చివరికి భూభౌతిక పరీక్షలను జరిపి ఆ నివేదికలను తమకు అందజేయాలని ఉచిత సలహా పారేసి నివేదికను ముగించారు. 
  • అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నది గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని డ్యాం సేఫ్టీ అథారిటీ వారే ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. అది దురదృష్టకరమైనదే. ప్రభుత్వం గాని, ఇంజనీర్లు గాని ఎవరూ ఇటువంటి సంఘటన జరగాలని కోరుకోరు. 
  • నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారు ఏవైనా పునరుద్దరణ చర్యలు సూచిస్తారని ఆశించిన ప్రాజెక్టు ఇంజనీర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. వారు రెండుసార్లు పర్యటించి పోలీసుల తరహాలో రహాస్య విచారణ చేపట్టినప్పుడు వానాకాలంలో వరదల నుంచి మేడిగడ్డ బ్యారేజీని రక్షించడానికి తాత్కాలిక చర్యలు సూచించాలని ఇంజనీర్లు, ప్రభుత్వ పెద్దలు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీని కోరినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. 
  • రెండు నెలలు గడచినా వారి నుంచి చడీ చప్పుడు లేదు. రుతు పవనాల ఆగమనానికి సమయం దగ్గర పడుతూ ఉన్నది. వారు మాత్రం రక్షణ చర్యలు సూచించలేదు. ఆ సంస్థ ఏర్పాటు అయ్యిందే దేశంలో ఉండే డ్యాంలు, బ్యారేజీల సంరక్షణ కోసం. అయితే వీరు మాత్రం అన్ని కేంద్ర సంస్థల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలను కాపాడే దిశగా పని చేస్తున్నారని వారి ప్రాథమిక నివేదిక, ఆ తర్వాత వారి నిర్లక్ష్య వైఖరి స్పష్టం చేసింది. 
  • ఆ తర్వాత పి సి ఘోష్ విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతనే వారు తాత్కాలిక రక్షణా చర్యలు సూచిస్తూ మె నెలలో నివేదిక పంపినారు. ఇందులో తమకు తెలియని కొత్త పరిష్కార మార్గాలు ఏమీ లేవని, తాము చెప్పిన పరిష్కార మార్గాలే తమకు సూచించినారని, దీని కోసం నాలుగు నెలల విలువైన కాలాన్ని హరించి వేశారని ఇంజనీర్లు వాపోయారు. ఇదీ ఘనమైన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారి నిర్వాకం. 
  • శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారు చెప్పినవే పరిష్కారాలు అని ప్రభుత్వం కూడా భావించి రాష్ట్ర ఇంజనీర్లను ముందుకు సాగనివ్వలేదు. గోదావరికి వరదలు రాకముందే బ్యారేజీకి సరైయిన రక్షణ చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం NDSA నివేదిక కోసం ఎదురు చూస్తూ 4 నెలల విలువైన కాలాన్ని వృథా చేసింది. ఇప్పుడేమో వరదల కారణంగా పరీక్షలు ఆపివేశామని చెప్పడం బాధ్యతా రాహిత్యం కాదా 
  • గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజి పునరుద్దరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దారుణంగా విఫలమైంది. వారి నుంచి నివేదికను తెప్పించుకోవడంలో ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే. రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందడమే కాక మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఇంకా ఎంతకాలం చేస్తారు ? వానాకాలం ముగిసే నాటికి NDSA నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబందించిన నివేదికను తెప్పించుకోవడం పట్ల శ్రద్ధ వహించాలని ఉత్తమ్ ను కోరుతున్నా. 
  • తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతాం అని ఉత్తమ్ కుమార్ అన్నాడు. సంతోషం. మా ప్రభుత్వం గతంలోనే 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజి నిర్మించాడానికి మహారాష్ట్రాను ఒప్పించాము. మహారాష్ట్రా ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి ఏ ఎత్తు వద్ద కడతారు? ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వద్దనా ? 152 మీటర్ల వద్దనా ? ఉత్తమ్ స్పష్టం చేయాలి. 152 మీటర్ల వద్ద బ్యారేజి కట్టాలని అనుకుంటే మొదట మహారాష్ట్రా ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ఆ తర్వాతనె బ్యారేజి పనులను ప్రారంభించాలని ఉత్తమ్ ను కోరుతున్నాను. 
  • కేంద్రంలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో, మహారాష్ట్రాలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏలుతున్న కాలంలోనే 152 మీటర్ల వద్ద బ్యారేజి నిర్మానికి ఒప్పందం చేసుకోలేక పోయి చేతులెత్తేసింది ఎవరు ? మహారాష్ట్రాతో ఒప్పందం చేసుకోలేక తుమ్మిడిహట్టి  బ్యారేజి పనులను ప్రారంభించక వదిలేసింది ఎవరు ? ఆ వైఫల్యం మీది కాదా.  తలను వదిలేసి తోక నుంచి పనులకు టెండర్లు పిలిచి మొదలుపెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్స్ ల పేరు మీద, సర్వే , డిజైన్ల పేరు మీద తట్ట మట్టి ఎత్తక ముందే వందల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించి కమీషన్లు దండుకున్నది మీరు కాదా ?  
  • 2013 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ రాసిన లేఖలోని అంశాలు ఉత్తమ్ మరొక్కసారి చదువుకోవాలని సూచిస్తున్నా. వారు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహట్టి బ్యారేజిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నా. 
  • గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఉత్తమ్ ప్రకటించడం ఆయన అవగాహనారాహిత్యాన్ని సూచిస్తున్నది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి కట్టినా లిఫ్ట్ లేకుండా ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్ళు రావని ఉత్తమ్ కుమార్ గారికి తెలువకపోయి ఉంటుంది. ప్రాజెక్టు ఇంజనీర్లను అడిగితే అక్కడ కూడా 40 మీటర్ల లిఫ్ట్ అవసరమని చెపుతారు. 
  • తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తీసుకు రావచ్చు అన్న అబద్దపు ప్రచారాన్ని సాగునీటి మంత్రిగా పదవి స్వీకరించిన 7 నెలల తర్వాత కూడా నమ్మడం విచిత్రం. 
  • రీ ఇంజనీరింగ్ తర్వాత కూడా జలాశయాల నిల్వ సామర్థ్యం పెంచడం తప్ప ఎల్లంపల్లి నుంచి పైకి నీటిని తీసుకు వచ్చే అలైన్మెంట్ ఏ మార్పు లేదు. కాబట్టి ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టు అయినా , కాళేశ్వరం ప్రాజెక్టు అయినా రెండూ కూడా మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకాలే. రెండింటిలో కరెంటు ఖర్చు దాదాపు సమానమే. ఉత్తమ్ ప్రవచించినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుల మాత్రమే కరెంటు ఖర్చులు ఎక్కువ , తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో తక్కువ అన్నది తప్పుడు అవగాహన. 
  • మా  ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేస్తాం అంటున్నాడు ఉత్తమ్. అక్కడ బ్యారేజి నిర్మాణం చేయగలిగే పరిస్థితి ఉంటే పదేళ్ళ కాంగ్రెస్ హయాంలోనే పూర్తి అయి ఉండేది. మాకు రీ ఇంజనీరింగ్ చేసే అగత్యం తప్పేది. అక్కడ పరిష్కరించలేని సమస్యలు ఉన్న కారణంగానే మా ప్రభుత్వం కూడా 148 మీటర్ల వద్ద ఒప్పందం ఉన్నప్పటికీ బ్యారేజీని నిర్మించలేకపోయాము. దానికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజీని ప్రతిపాదించినాము. 
  • మా ప్రభుత్వం వార్ధా బ్యారేజి ఎందుకు ప్రతిపాదించింది  ? తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించి ఆ బ్యారేజి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు 20 టిఎంసిల సాగునీరు ఇవ్వాలని మేము  భావించాము. మిగతా జిల్లాల అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేశాము. 
  • తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణానికి సాంకేతికంగా అడ్డంకులు, బ్యారేజీ స్థలంలో మహారాష్ట్రా భూభాగంలో చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం ఉండడం, బ్యారేజీకి నది ప్రవాహం 40 డిగ్రీల కోణంలో ఉండడంతో బ్యారేజి పొడవు సుమారు 6.5 కిలోమీటర్లు ఉంటుందని, 110 గేట్లు అమార్చవలసి ఉంటుందని ఇంజనీర్లు అంచనా వేశారు. నదీ ప్రవాహానికి 40 డిగ్రీల కోణంలో బ్యారేజి నిర్మాణం కూడా క్లిష్టమైనది. దేశంలో గాని, విదేశాల్లో గాని ఎక్కడ skew బ్యారేజీలు నిర్మించిన దాఖలాలు లేవు. 
  • బ్యారేజి ఖర్చు కూడా భారీగా ఉండడంతో ప్రభుత్వం 20 టిఎంసిల నీటిని తరలించడానికి వార్ధా నదిపై తుమ్మిడిహట్టికి సుమారు 2 కిమీ ఎగువన వీర్దండి గ్రామం వద్ద బ్యారేజి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. వార్ధా నదిపై బ్యారేజి పొడవు మట్టి కట్ట సహా 1.75 కిమీ  కు తగ్గిపోయింది. గేట్ల సంఖ్య 110 నుంచి 29 కి తగ్గింది. ముంపు గణనీయంగా తగ్గింది. బ్యారేజి నిల్వ సామర్థ్యం కూడా 1.80 టిఎంసిల నుంచి 2.95 టిఎంసిలకు పెరిగింది. దీనితో బ్యారేజి నిర్మాణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. 
  • వాప్కోస్ సంస్థ బి ఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు డి పి ఆర్ ను సుమారు 4550 కోట్లకు తయారు చేసింది. ఇందులో భూసేకరణ, బ్యారేజి, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ లు, ఫీల్డ్ ఛానళ్ళు, కరకట్టలు, పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజి స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులు, 18 శాతం GST .. అన్నీ కలిసి ఉన్నాయి. జి ఎస్ టి వ్యయమే రు. 622.40 కోట్లు. 2023 అక్టోబర్ లో వార్ధా డిపిఆర్ ను కేంద్ర జల సంఘానికి సమర్పించడం కూడా జరిగింది. అనుమతుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 
  • వార్ధా బ్యారేజి నివేదికను మహారాష్టకు పంపించాము. వారితో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. ఈ లోపు ప్రభుత్వం మారడంతో వార్ధా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురి అవుతున్నది. మీ ప్రభుత్వం మళ్ళీ తుమ్మిడిహట్టి బ్యారేజీని నిర్మించి తీరుతామని చెపుతున్నది. అందులో ఇమిడి ఉన్న సమస్యలు అవగతం చేసుకోకుండానే ఈ తుమ్మిడిహట్టి రాగాన్ని ఎత్తుకున్నారు. 
  • ప్రభుత్వానికి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు  అందించాలన్న చిత్తశుద్ది ఉంటే ఏ సాంకేతిక సమస్యలు లేని, ఖర్చు తక్కువగా ఉండే వార్ధా ప్రాజెక్టును మీ ప్రభుత్వ కాలంలో పూర్తి చేయమని కోరుతున్నా. 
  • గత ప్రభుత్వంలో అట్టహాసంగా, ఆర్భాటంగా కాళేశ్వరం నిర్మాణం చేశారు. ఎక్కువ పైసలు ఖర్చు పెడితే, ఎక్కువ కమిషన్ వస్తుందనే కక్కుర్తి తో నిర్మాణం చేపట్టారని ఉత్తమ్ మా ప్రభుత్వం మీద మరొకసారి అక్కసు వెళ్ళగక్కారు. కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా చేపట్టలేదు. సంవత్సరం పాటు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఒప్పించే ప్రయత్నం చిత్తశుద్దితో చేశాము. 
  • నేను సాగునీటి మంత్రిగా అనేక సార్లు ముంబాయి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంతో, ఆ తర్వాత బిజెపి ప్రభుత్వంతో చర్చలు జరిపాము. ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ కూడా రెండుసార్లు ముంబాయి వెళ్ళు దేవేంద్ర ఫడ్నవీస్ తో ఆనాటి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు సమక్షంలో చర్చలు జరిపినాడు. 
  • తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ ఆర్ ఏల్ వద్ద బ్యారేజి నిర్మాణానికి ఆమోదం తెలుపమని కెసిఆర్ అభ్యర్థించారు. మహారాష్ట్రాలో ముంపుకు గురి అవుతున్న భూములకు మహారాష్ట్రా నిర్ధారించిన పరిహారాన్ని చెల్లిస్తామని అన్నారు. జవాబుగా ఫడ్నవీస్ స్పష్టంగా అన్నమాట ఏమిటంటే.. కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రాలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మహారాష్ట్రా ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజి నిర్మాణానికి అనుమతించ లేదు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించి అరెస్ట్ అయిన నేను అనుమతి ఎట్లా ఇస్తాను? బ్యారేజి ఎత్తును 4 మీటర్లు తగ్గించి 148 మీటర్ల వద్ద కట్టుకోండి. గోదావరి అవార్డు ప్రకారం మీరు ఎన్ని నీళ్ళు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. ఇదీ ఆనాటి మహారాష్ట్రా గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు సమక్షంలో మహారాష్ట్రా ముఖ్యమంత్రి అన్నమాటలు. 
  • ఇక వారితో సంప్రదింపులు అంటే కాలాయాపన తప్ప మరేమీ ఉండదని కెసిఆర్ నిర్ధారణకు వచ్చారు. చర్చలు విఫలం అయినాయి. అందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రయత్న లోపం వల్ల కాదు. మహారాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లనే చర్చలు ముందుకు సాగలేదు.
  • తర్వాత 4.3.2015 న తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్ లో నీటి లభ్యత అనుమానాస్పదమని కేంద్ర జల సంఘం లేఖ రాసిన తర్వాత ఇక మహారాష్ట్రాతో ఎఫ్ ఆర్ ఏల్, ముంపు పంచాయతీ పరిష్కారం అయినా కూడా ప్రాజెక్టు సాఫల్యతకు అవసరమైన నీటి లభ్యతనే ప్రశ్నార్థకం అయినప్పుడు ప్రభుత్వం ఏమి చెయ్యాలి? ప్రాజెక్టు సాఫల్యత కోసం ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చింది. ఆ వెతుకులాటలో దొరికిందే మేడిగడ్డ. 
  • ఇది 1990 వ దశకంలో గోదావరి జలాల వినియోగంపై ప్రముఖ ఇంజనీర్, ఐక్యరాజ్య సమితి సలహాదారు దివంగత శ్రీ. టి హనుమంతరావు గారు “ స్టెప్ ల్యాడర్ టెక్నాలజీ” లో భాగంగా ప్రతిపాదించిన ఏడు వరుస బ్యారేజిల్లో ఒకటైన సూరారం బ్యారేజి స్థలమే.
  • 152 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని తీవ్రంగా వ్యతిరేకించిన ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత సానుకూలంగా స్పందించింది. రెండు రాష్ట్రాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం. 
  • కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా , అట్టహాసం ప్రారంభించామని ఆరోపించడం వారి ఫైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తప్ప మరో ఉద్దేశ్యం కనిపించడం లేదు.  లక్ష కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించారు అని ఉత్తం  పాత ఆరోపణనే మరో సారి చేశారు. 
  • ప్రాజెక్టుకు 80,190 కోట్లకు వ్యయానికి కేంద్ర జల సంఘం అనుమతిని జారీ చేసింది. ఆ తర్వాత గోదావరి జలాలపై మన హక్కులను స్థిర పరచుకోవడానికి అదనపు టిఎంసి పనులను ప్రారంభించింది. ఆ ఖర్చును కూడా కలిపి సవరించిన డిపిఆర్ ను 1,27,000 కోట్లకు కేంద్ర జల సంఘానికి పంపించాము. 
  • మా ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి ప్రాజెక్టు మీద పెట్టిన వ్యయం సుమారు 94 వేల కోట్లు మాత్రమే. ఇది నేను చెపుతున్నది. కాదు. మీ ప్రభుత్వమే అసెంబ్లీ లో ప్రకటించింది. ప్రాజెక్టుపై ఖర్చు 94 వేల కోట్లు ఉంటే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం ఏమి నైతికత ? 
  • కాళేశ్వరం లో ఐదేళ్ల పాటూ పంప్ అయిన నీళ్ళు 65 టిఎంసిలు మాత్రమే అని ఉత్తమ చెప్పడం మరొక విచిత్రం. ప్రాజెక్టు ఇంజనీర్లు మీకు సమకూర్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టులో ఎత్తిపోసిన నీరు, ఆ నీటిని ఎట్లా వినియోగించామో .. ఆ వివరాలు ఇట్లా ఉన్నాయి.  

ఎత్తిపోసిన నీరు : 

  • మేడిగడ్డ నుంచి – 162.368 టిఎంసిలు 
  • అన్నారం నుంచి – 172.866 టిఎంసిలు 
  • సుందిళ్ళ నుంచి – నంది మేడారం పంప్ హౌజ్ నుంచి – 177.129 టిఎంసిలు
  • నంది మేడారం పంప్ హౌజ్ నుంచి –  184.68 టిఎంసిలు
  • గాయత్రి పంప్ హౌజ్ నుంచి మిడ్ మానేరుకు  – 180.82 టిఎంసిలు
  • మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ కు – 50.31 టిఎంసిలు 
  • అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ కు – 46.2 టిఎంసిలు 
  • రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్ కు – 41.35 టిఎంసిలు 
  • మల్లన్నసాగర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ కు – 18.808 టిఎంసిలు 

నీటి వినియోగం : 

  • నీళ్ళను చెరువులు , చెక్ డ్యాంలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98 వేల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడం జరిగింది. 
  • Ayacut Details : 
  • Total new ayacut of 98,570 acres irrigated through Kaleshwaram project
  • 456 MI tanks filled through Kaleshwaram project Canals 
  • 2,143 MI tanks were filled with Kaleshwaram project through other projects canals of SRSP stage  I&II and  Nizam Sagar Project. 
  • Existing ayacut was stabilized under SRSP stage-I below LMD, SRSP Stage-II and  Nizamsagar projects in form of crucial wettings at crucial period in the crop cycle, thereby stabilizing the ayacut of 17,08,230 Acres (Khariff & Rabi– Proposed) in 2023-24 From 2020-21 Rabi to 2023-24 Kharif, 
  • water was released to Kudelli Vagu and Haldi Vagu to  66 fill check dams for an ayacut of 20,576 acres
  • కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయి అన్ని పంపులు పని చేస్తే ఏడాదికి కరెంట్ చార్జిలే 10 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. వడ్డీకి 15 వేల కోట్లు, విద్యుత్ చార్జీలకు 10 వేల కోట్లు ఖర్చు కానుంది అని అవగాహనారాహిత్యంతో ఆరోపణలు చేసినాడు ఉత్తం.  ఉత్తంకు ఒకటే నా సూటి ప్రశ్న. ఎత్తిపోతల పథకాలలో కరెంటు ఖర్చు కాకుండా నీటి సరఫరా ఎట్లా చేస్తారో ఉత్తం వివరించాలి. 
  • ఉమ్మడి రాష్ట్రంలో మీ హయాంలో జలయజ్ఞంలో తెలంగాణలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ళ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ , దేవాదుల, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ , అలీసాగర్, గత్పా , చౌటుపల్లి, ఎల్లంపల్లి, గూడెం, చిన్న కాళేశ్వరం, మంథని  తదితర ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల పథకాలే కదా. వీటికి కరెంటు ఖర్చు లేకుండానే నీటి సరఫరా చేద్దామని అనుకున్నారా ఉత్తం గారు. 
  • ఎత్తిపోతల పథకాలకు కరెంటు ఖర్చు తప్పనిసరి. కరెంటు ఖర్చులు ఉంటాయని ఎత్తిపోతలు నిర్మించకపోతే తెలంగాణ ఎప్పటికీ కరువు ప్రాంతంగా, వలసల ప్రాంతంగా, రైతుల ఆత్మ హత్యలకు నిలయంగా మారిపోతుంది. తెలంగాణ భౌగోళిక పరిస్థితి అది. ఉత్తం గారు కొంచెం సోయితో మాట్లాడండి. కనీసం దిల్లీలో మాట్లాడేటప్పుడు తెలంగాణ పరువు తీయకండి. 
  • వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే  మేడిగడ్డ ప్రాజెక్టు మేడిగడ్డ  ఫౌండేషన్ ఆరడుగులు కుంగి పోయింది అని కూడా అన్నాడు. అది అందరికీ తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ల కుంగుబాటు ఒక దురదృష్టకరమైన సంఘటన. అట్లా జరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. 
  • 2022 లో సంభవించిన వరద గోదావరి చరిత్రలోనే అతి పెద్దది. మేడిగడ్డ బ్యారేజి వద్ద 28 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద ప్రవాహం నమోదు అయ్యింది. బ్యారేజి కింద సిమెంట్ బ్లాకులు అక్కడక్కడ లేచిపోయి ఉన్నందున చిన్నలీకేజీలు బుంగలుగా మారి రాఫ్ట్ కింద సొరంగం ఏర్పడడానికి దోహదం చేసింది. బ్లాక్ 7 లో రాఫ్ట్ కింద ఏర్పడిన ఈ సొరంగం 2023 లో సంభవించిన భారీ వరదల అనంతరం అక్టోబర్ చివరి వారంలో మూడు పిల్లర్ల కుంగుబాటుకు కారణమయ్యిందని తెలుస్తూనే ఉన్నది.
  • ఇది అనుకోకుండా జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X