23-01-2026 నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఆ చానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది.
గౌరవ శాసనమండలి సభ్యుడిని “గెట్ ఔట్ ఫ్రం మై చానెల్” అని సదరు టీవీ చానెల్ వ్యాఖ్యాత అనడం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

డిబేట్కు పిలిచిన అతిథి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆంధ్రజ్యోతి చానెల్ను డిమాండ్ చేస్తున్నాం.

Also Read-
తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉన్నది. తదనంతర కాలంలో కూడా అనేకసార్లు భారత రాష్ట్ర సమితి నాయకుల మీద అసత్య కథనాలు ప్రచురించడం/ప్రసారం చేయడం, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రచురించడం/ప్రసారం చేయడం ఆంధ్రజ్యోతి గ్రూప్ పదే పదే చేస్తున్నది.

బీఆర్ఎస్ పట్ల, తెలంగాణ పట్ల ఆంధ్రజ్యోతి వైఖరి మారకపోవడం వల్ల ఇకపై బీఆర్ఎస్ నాయకులు ఎవరూ ఏబీఎన్ చానెల్లో జరిగే చర్చల్లో పాల్గొనరాదని నిర్ణయించాం. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కానీ, జిల్లా కార్యాలయాల్లో కానీ జరిగే పార్టీ సమావేశాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని పార్టీ నిర్ణయించడం జరిగింది.
సోమ భరత్ కుమార్
(పార్టీ ప్రధాన కార్యదర్శి, బి ఆర్ ఎస్)
