హైదరాబాద్ : పాస్పోర్ట్, పౌరసత్వ అంశంపై హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పు, ఇవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడినవి. ప్రఖ్యాత విదేశీ సంస్థలో చదువుకున్న వ్యక్తిగా, బారిష్టర్ అభ్యసించిన వ్యక్తిగా.. భారతదేశ చట్టాల్లోని ప్రాథమిక సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం విచారకరం.
ఒక ప్రజాప్రతినిధిగా, న్యాయ సంబంధిత అంశాలపై పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, పాస్పోర్ట్ మరియు పౌరసత్వం మధ్య చట్టపరమైన స్పష్టమైన తేడాను ఒవైసీ గారు తెలుసుకోవాలని ప్రజలు ఆశిస్తారు. కానీ, ఆయన వ్యాఖ్యలు చట్టంపై పూర్తి అవగాహన లేకపోయి ఉండొచ్చు. లేదంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో కావాలనే గందరగోళాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చెప్పిన వివరణ ప్రకారం.. భారతీయ పాస్పోర్ట్ కు విలువలేదని అర్థం కాదు. పాస్పోర్ట్ ఒక్కటే భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే ఆధారం కాదని మాత్రమే విదేశాంగ శాఖ చెప్పింది. భారత రాజ్యాంగం ప్రకారం, పౌరసత్వ చట్టం-1955 ప్రకారం భారతదేశంలో పౌరసత్వం నిర్ణయించబడుతుంది. ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్ ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించరు.
Also Read-
పాస్పోర్ట్స్ చట్టం – 1967 ప్రకారమే.. పాస్పోర్ట్ జారీ చేయబడుతుంది. దీన్ని విదేశాలకు వెళ్లేవారు.. ఓ ట్రావెల్ డాక్యుమెంట్ గా మాత్రమే వినియోగించాలని స్పష్టంగా చట్టంలో పేర్కొన్నారు. పాస్పోర్ట్స్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం, ప్రజాహితాన్ని దృష్టిలోపెట్టుకుని.. భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ జారీ చేసే అధికారం ఉంది. కాబట్టి, చట్టంలోని అంశాలను జాగ్రత్తగా గమనిస్తే.. పాస్పోర్ట్ను పౌరసత్వాన్ని నిర్ధారించే ఆధారంగా పరిగణించలేం.
ఇది మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన కాదు. పాస్పోర్ట్స్ చట్టం – 1967లో, కాంగ్రెస్ పాలనలోనే అమలులోకి వచ్చింది. కాబట్టి, ఈ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే మీరు చట్టం గురించి అవగాహన లేని వ్యక్తి కావడం లేదా ఉద్దేశపూర్వకంగా నిజాలను దాచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోంది.
భారతదేశంలో పౌరసత్వ చట్టం – 1955 ప్రకారం.. జననం, వంశపారంపర్యత, నేచురలైజేషన్ (విదేశీయులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం) వంటి చట్టబద్ధ మార్గాల ద్వారా పౌరసత్వం నిర్ధారితం అవుతుంది. అనేక సందర్భాల్లో.. ముఖ్యంగా పుట్టిన తేదీ, జన్మస్థలం, తల్లిదండ్రుల పౌరసత్వ స్థితి ఆధారంగా పౌరసత్వం నిర్ణయించాల్సి వచ్చినప్పుడు, ఇతర డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. ఈ డాక్యుమెంట్స్ లో.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, పాఠశాల రికార్డులు, ఓటరు జాబితా నమోదు వివరాలు, నివాస ధ్రువీకరణలు, ప్రభుత్వ రికార్డులు, పాస్పోర్ట్ మరియు ఇతర సమకాలీన పత్రాలుంటాయి.
భారతీయ న్యాయస్థానాలు కూడా పాస్పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి తుది ఆధారం కాదని పలు సందర్భాల్లో పునరుద్ఘాటించాయి. పాస్పోర్ట్ కలిగి ఉండటం ఒక్కటే.. పౌరసత్వ చట్టంలోని నిబంధనలను పూర్తిచేసినట్లు కాదని 2013లో బొంబాయి హైకోర్టు కూడా స్పష్టంగా పేర్కొంది.
అందువల్ల, ఒవైసీతోపాటుగా ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మోదీ ప్రభుత్వమో లేదా.. విదేశాంగ మంత్రిత్వ శాఖనో.. కొత్త నిబంధనను తీసుకురాలేదు. పౌరసత్వం అనేది రాజ్యాంగం ప్రకారం, పౌరసత్వ చట్టం ప్రకారం సంక్రమిస్తుందని తెలుసుకోవాలి. కేవలం ఒక పత్రం పౌరసత్వం నిర్ధారించ బడదు ఆధారంగా నిర్ణయించబడదు.
ప్రజాజీవితంలో, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న నాయకులు ఇలాంటి విషయాలు వచ్చినపుడు.. తమ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల్లో ఆందోళన కలిగేలా కాకుండా.. బాధ్యతతో మాట్లాడాలి. చట్టపరమైన సూత్రాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చిత్రీకరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒవైసీ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానేసి, నిరాధార వ్యాఖ్యలు చేయడానికి ముందుగా.. పౌరసత్వ చట్టం – 1955, పాస్పోర్ట్స్ చట్టం – 1967ను ముందుగా చదవాలి
